సిటీబ్యూరో, సెప్టెంబర్ 22(నమస్తే తెలంగాణ): గ్రేటర్లో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక, సామాజిక అభివృద్ధికి దోహదం చేసే విధంగా రుణాలు అందించాలని కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా నగరంలో అమలు చేస్తున్న పథకాలపై కమిషనర్ శుక్రవారం సమీక్షించారు. శానిటేషన్లో మహిళా సంఘాలకు నిర్మాణాత్మకంగా, సహజంగా అందించే విధంగా కృషి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ పేర్కొన్నారు. నగరంలో పలు కాలనీలలో ఇంటి చెత్తను ఇష్టానుసారంగా పడేయకుండా స్వచ్ఛ ఆటోలో వేసే విధంగా స్వయం సహాయక సంఘాల మహిళలను భాగస్వామ్యం చేయాలని అధికారులను ఆదేశించారు. స్లమ్ లెవెల్ ఫెడరేషన్ ప్రతినిధులు వారి వారి సంఘం సభ్యులు స్వచ్ఛ ఆటోకు చెత్తను అందిస్తున్నారో లేదో పరిశీలన చేయాలని, అసలు వారు ఎందుకు ఆటోలో ఇంటి చెత్తను వేయడం లేదో పరిశీలించాలన్నారు. ప్రతి ఒకరు ఇంటి చెత్తను గార్బేజ్ పాయింట్ వద్ద గాని, ఇంకొక చోట గాని ఇష్టానుసారంగా వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
బ్యాంక్ లింకేజ్తో లక్ష్యానికి చేరువ కావాలి
బ్యాంక్ లింకేజ్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యాన్ని మించి అధికంగా అందించాలని కమిషనర్ తెలిపారు. బ్యాంక్ లింకేజ్లో అర్హులైన వారికి అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్హెచ్జీ నెలవారి సమావేశంలో ప్రభుత్వ పథకాల గురించి చర్చించుకోవాలన్నారు. ఫైనాన్షియల్ విషయాలు కూడా చర్చించి తగు నిర్ణయాలు తీసుకోవాలని తెలిపారు. తీసుకున్న రుణాలకు ఏం వ్యాపారం చేసుకుంటున్నారో వివరాలు కూడా సేకరించాలని తెలిపారు. మహిళా ఆర్థిక స్వావలంబనకు బ్యాంక్ లింకేజ్ ఆర్థిక సహాయం అందించాలన్నారు. స్ట్రీట్ వెండర్లకు నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు అందించాలని, వారికి ఐడీ కార్డులు జారీ చేయాలన్నారు. రుణాల మంజూరు ఎప్పటి కప్పుడు చేయించాలని అధికారులను ఆదేశించారు. స్లమ్ లెవెల్, టౌన్ లెవెల్ ఫెడరేషన్లకు స్వయం ఉపాధి పథకాలు అందించేందుకు కృషి చేయాలన్నారు. సీనియర్ సిటిజన్ల దరఖాస్తులకు వెంటనే పరిషారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఓటు హకు లేని వారికి ఓటరుగా నమోదు చేయించి ఓటు వినియోగించుకునేలా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ చంద్రారెడ్డి, పీడీ సౌజన్య, విజయలక్ష్మి, పిఓలు పాల్గొన్నారు.