డబ్బుల్లేకుండా పనులు నిలిచిన సంఘటనలు ఇప్పటిదాకా చూశాం.. కానీ డబ్బులు ఉన్నా పనులను అటకెక్కించడం ఘనత వహించిన జీహెచ్ఎంసీకే చెల్లింది. తమ కలల ఇంటి సౌధమైన డబుల్ బెడ్ రూం ఇండ్లు దక్కించుకొని.. ఆ ఇంటిలో ప్రశాంత జీవనం గడుపుదామని అనుకున్న లబ్ధిదారులకు కమిషనర్ రొనాల్డ్ రాస్ వ్యవహారశైలి శాపంగా మారుతోంది. డబుల్ బెడ్ రూం పట్టాలు ఇచ్చారు సరే .. అందులో ఉందామంటే కనీసం కరెంట్ కనెక్షన్, నిర్వహణ సరిగా లేదంటూ సోమవారం ప్రజావాణి వేదికగా
లబ్ధిదారులు గగ్గోలు పెట్టారు.
సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ ) : నిరుపేదలు ఆత్మగౌరవంతో బతకాలన్న బలమైన సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం 111 లోకేషన్లలో డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఉన్న చోటనే 27 ప్రాంతాల్లో (ఇన్సైట్)లో 5,363 మందికి, 39 లోకేషన్లలో 63, 478 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ ర్రూ ఇండ్లను అందజేసింది. లక్ష డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీలో భాగంగా 66 లోకేషన్లలో మొత్తం 68,841 మందికి పట్టాలు అందజేశారు. అయితే కార్పొరేట్ స్థాయిలో ఈ ప్రాజెక్టులో మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. కొన్ని చోట్ల కరెంట్ కనెక్షన్, కేబుల్ నెట్వర్క్, ఇంటర్ నెట్, ఇతర మెయింటనెన్స్ పనులు పెండింగ్లో ఉన్నాయి.
ఈ మౌలిక వసతుల కల్పనలోనూ రాజీ పడకుండా కేసీఆర్ సర్కారు హెచ్ఎండీఏ నుంచి రూ. 100 కోట్లను జీహెచ్ఎంసీకి బదలాయించింది. నిబంధనల ప్రకారమే జీహెచ్ఎంసీ ఖజానాలోకి రూ.100 కోట్లు వచ్చి చేరాయి. కానీ నేటికీ ఈ నిధులు ఖజానా నుంచి నిర్వహణకు మళ్లలేదు. సంబంధిత అధికారులు నిధులు ఉన్నాయని, నిర్వహణ పనులు చేపట్టాలని గడిచిన రెండు నెలలుగా కమిషనర్కు ప్రతిపాదనలు పెట్టారు. కానీ కమిషనర్ మాత్రం ఎటూ తేల్చకుండా ‘డిస్కస్’ అంటూ కాలయాపన చేస్తుండడంపై సంబంధిత శాఖ అధికారులు చేసేదేమీ లేక తలలు పట్టుకుంటున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతున్నది.
రోజుల తరబడి ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా తన వద్దనే ఫైల్ అంటిపెట్టుకున్న కమిషనర్ తీరుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని ఒక పక్క బాధితులంతా ప్రజావాణిలో గగ్గోలు పెడుతుంటే ..ప్రజా సంక్షేమం వైపు సకాలంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన కమిషనర్ తీరు సరిగా లేదంటూ కార్పొరేటర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. హెచ్ఎండీఏ నుంచి వచ్చిన రూ.100కోట్లు నిధులు భద్రంగానే ఉన్నాయా? ఇతర పనులకు ఈ నిధులను మళ్లించారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమస్య జఠిలం కాకముందే కమిషనర్ రొనాల్డ్ రాస్ ఈ విషయంపై సరైన నిర్ణయం తీసుకోవాలని, నిర్వహణ పనులను పూర్తి చేయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.