సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): పంజాగుట్ట శ్మశానవాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నె కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట శ్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో పర్యటించారు. శ్మశాన వాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఆఫీస్ గది, మిగిలిన పనులను పూర్తి చేయాలన్నారు. సింగిడికుంట నాలా అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, ఆదే విధంగా నాలా బాక్స్ డ్రైన్ పునర్నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు.
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో గల వివాదాస్పద స్థలంలో మల్టీ లెవల్ పార్కింగ్ నిర్మాణానికి అదే విధంగా తట్టిఖానా రిజర్వాయర్ సైట్ వద్ద కూడా మల్టీలెవల్ పార్కు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని టౌన్ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. అంతకు ముందు కమిషనర్ జేవీఆర్ పార్కులో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. సింగిడికుంట, నాయుడునగర్ బస్తీల్లో నాలా మీద పైకప్పు దెబ్బతిన్న ప్రాంతాల్లో పునర్నిర్మాణం కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట జోనల్ కమిషనర్ వెంకటేష్ దోత్రే, ఎస్ఈ రత్నాకర్, యూబీడీ అదనపు కమిషనర్ డాక్టర్ సునంద తదితరులు పాల్గొన్నారు.