GHMC | సిటీబ్యూరో, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్బేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ)పై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు. గ్రేటర్లో డస్ట్బిన్లు ఎత్తివేసి.. స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటి చెత్తను సేకరిస్తుం డగా.. అక్కడక్కడ కొందరు బహిరంగంగానే చెత్త వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో చెత్తకుప్పలను తగ్గించడం, ప్రతి ఒక్కరూ వ్యర్థాలను స్వచ్ఛ ఆటోలకు ఇచ్చేలా అవగాహన కల్పించేందుకు బస్తీ కార్యాచరణను అమ లు చేస్తున్నారు. వారం రోజుల యాక్షన్ ప్లాన్లో బస్తీ సమావేశాలు, స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వని గృహాలు, బస్తీల్లో ర్యాలీలు, అవగాహన కార్యక్రమాలు, తరచూ చెత్త వేసే ప్రాంతాల్లో చెత్త మళ్లీ వేయకుండా రంగోళి (ముగ్గులు), టౌన్ వెండింగ్ కమిటీ మీటింగ్, ప్రతిజ్ఞ కార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే వారం రోజుల బస్తీ కార్యాచరణతో ఫిర్యాదులను స్వీకరించారు.
క్షేత్రస్థాయి సమావేశాలతో 1,87,752 ఇండ్ల యజమానులు స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వట్లేదని తేలిందని కమిషనర్ రొనాల్డ్ రాస్ పేర్కొన్నారు. వారితో మాట్లాడి 1.4 లక్షల ఇండ్లకు స్వచ్ఛ ఆటోలతో అనుసంధానం చేశామని, వారం రోజుల్లో 863 ర్యాలీలు నిర్వహించినట్లు తెలిపారు. ఇంటింటి చెత్త సేకరణను 100శాతం సక్సెస్ చేయాలని.. స్వచ్ఛ ఆటోలకు చెత్త ఇవ్వకుండా రోడ్లపై పడేస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు.