సిటీబ్యూరో, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల నిర్వహణలో సెక్టోరల్ అధికారులు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అన్నారు. రానున్న పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా గురువారం జూబ్లీహిల్స్లోని సేవాలాల్ బంజారా భవన్లో ఎన్నికల సెక్టోరల్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా సెక్టోరల్ అధికారులు నిర్వర్తించాల్సిన విధులు, బాధ్యతలు, పరిశీలించాల్సిన విషయాలపై అంశాల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా క్షుణ్ణంగా అవగాహన కల్పించారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడి నిర్వర్తించవలసిన విధుల గురించి తెలియజేస్తూ రూపొందించిన హ్యాండ్ బుక్ను అందజేశారు. క్షేత్రస్థాయిలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో నెలకొన్న పరిస్థితులను ముందుగానే గమనిస్తూ, ఎప్పటికప్పుడు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు మ్యాపింగ్ తయారు చేయాలని కమిషనర్ తెలిపారు. విధులను ఎంతమాత్రం తేలికగా తీసుకోకూడదని, ప్రతి అంశంపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఎన్నికల కమిషన్ ఎప్పటికప్పుడు నియమ నిబంధనలు మార్పు చేస్తుందని ప్పారు. ఎవరైనా విధుల పట్ల అలసత్వాన్ని ప్రదర్శిస్తూ నిర్లక్ష్యానికి తావిస్తే, వారిపై చర్యలు తప్పవన్నారు. సెక్టోరల్ అధికారులు శిక్షణ తరగతులకు హాజరు కాని వారికి షోకాజ్ నోటీసు జారీ చేస్తామని అన్నారు.
సెక్టోరల్ అధికారులు పారదర్శకంగా, నిబంధనల మేరకు విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని కమిషనర్ చెప్పారు. తమ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించాలని, ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో తాజా స్థితిగతులను పరిశీలించాలని, గత ఎన్నికల్లో చోటు చేసుకున్న సంఘటనలు, పూర్తి వివరాలు నివేదిక సమర్పించాలని సూచించారు. సెక్టోరల్ అధికారులకు ఎన్నికల సమయంలో ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారాలు ఇస్తామన్నారు. ప్రధానంగా ఓటర్లను ఓటు హకు వినియోగించుకోకుండా నిలువరించే వారిని, అలాగే ఓటర్లను ప్రభావితం చేసే వారిపై నిఘా పెట్టి ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు. పోలీస్ అధికారులు, సెక్టోరల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హకు వినియోగించుకునేలా చూడాలని పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడానికి సమన్వయంతో పనిచేయాలని కోరారు. అనంతరం సెక్టోరల్ అధికారులకు ఈవీఎంల నిర్వహణపై అవగాహన కల్పించి, ఈవీఎంలపై హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరగతుల్లో అడిషనల్ కమిషనర్ వెంకటేశ్ దోత్రె, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, అడిషనల్ సీపీ విక్రమ్ సింగ్మాన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, జోనల్ కమిషనర్లు, ఏసీపీలు, సెక్టార్ అధికారులు, పోలీసు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.