పర్యావరణ పరిరక్షణకు ఏకో ఫ్రెండ్లీ విగ్రహాలను నెలకొల్పుదాం
నగర వాసులకు జీహెచ్ఎంసీ అవగాహన, విజ్ఞప్తి
సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): రానున్న వినాక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ‘మట్టి ప్రతిమలనే పూజిద్దాం..’ ‘పర్యావరణ పరిరక్షణకు సహకరిద్దాం’.. అంటూ జీహెచ్ఎంసీ నగరంలోని భక్తులకు అవగాహన కల్పిస్తున్నది. భక్తులు మట్టి ప్రతిమలనే ఏర్పాటు చేసుకోవాలని గురువారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. మట్టి విగ్రహాల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నది. ప్రజలను ఇబ్బందులను గురిచేసే పద్ధతులను వదిలేసి పర్యావరణ హిత మట్టి ప్రతిమల ఏర్పాటుకు ప్రతిఒకరూ ప్రాధాన్యత నివ్వాలని విజ్ఞప్తి చేసింది.
ఇందులో భాగంగా సర్కిళ్లవారీగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. సరిల్ పరిధిలోని జనసాంద్రత గల ప్రాంతాల్లో, వ్యాపార కాంప్లెక్స్, మాల్స్ తదితర 60 ప్రాంతాల్లో మట్టితో తయారు చేసిన గణేశుడి ప్రతిమలను ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. తయారీదారుల మొబైల్ నంబర్లను కూడా పొందుపర్చారు. ప్రతిమల తయారీ విధానంపై ఆసక్తి గలవారికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏకో ఫ్రెండ్లీ మట్టి విగ్రహాల తయారీలో శిక్షణ కొనసాగుతున్నదని తెలిపారు.