సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి జీహెచ్ఎంసీ, పోలీస్ శాఖ సంయుక్తంగా నడుం బిగించింది. ఇందులో భాగంగానే గురువారం ఉదయం జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, సీపీ శ్రీనివాస్ రెడ్డి అధికారులతో కలిసి జూబ్లీహిల్స్ రోడ్ నం.45, 36, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, కళింగ ట్రస్ట్ భవన్ పలు కూడళ్లలో తనిఖీలు నిర్వహించారు. ముఖ్యమైన జంక్షన్లలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి స్వల్ప, దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని నిర్ణయించారు. జూబ్లీహిల్స్ చెక్పోస్టులో ట్రాఫిక్ అవసరాలు, డిమాండ్కు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని టౌన్ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఫ్లై ఓవర్లు, అండర్పాస్ అవసరం గుర్తించి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ముఖ్యమైన జంక్షన్లలో వాహనాల కదలికలపై ఏజెన్సీని నియమించుకుని సర్వే జరిపి అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఈ పర్యటనలో నిర్ణయించారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ, పోలీస్, హెచ్ఎండీఏ అధికారుల సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు కమిషనర్ రొనాల్డ్ రాస్ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సీసీపీ రాజేంద్ర ప్రసాద్ నాయక్, సీఈ దేవానంద్, జోనల్ కమిషనర్ రవి కిరణ్, అదనపు కమిషనర్ శానిటేషన్ ఉపేందర్ రెడ్డి, ఎస్ఈ రత్నాకర్, డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.