సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ) : నిరుపేదలు సైతం గర్వించే స్థాయిలో వేడుకలు నిర్వహించుకునేలా ఆధునిక హంగులతో నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్హాల్స్పై కాంగ్రెస్ సర్కారు శీతకన్ను వేసింది. ఒకేసారి రెండు వేల మందితో వేడుక నిర్వహించేలా.. సకల సౌకర్యాలతో గత కేసీఆర్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ వ్యాప్తంగా రూ. 90 కోట్లతో 31 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్హాళ్లను నిర్మించాలని భావించింది.
గతేడాది డిసెంబర్ నాటికి రూ. 30.10కోట్లతో 12 చోట్ల మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నిర్మాణ దశలో 14 చోట్ల పనులు ఉండగా..కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు దాటినా.. ఆ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించకపోవడం..కమిషనర్ రొనాల్డ్ రాస్ సైతం అదే రీతిలో పురోగతిలో ఉన్న పనులను పట్టించుకోలేదు.
ఫలితంగా ఇంజినీర్లు సైతం పురోగతిలో ఉన్న పనులను ముందుకు తీసుకువెళ్లలేక చాలా చోట్ల పనులు చేయలేక చేతులెత్తేశారు. కాంట్రాక్టర్లకు నిధుల లేమి సమస్య ఒకవైపు..మరోవైపు ఇంజినీర్ల అలసత్వం మరోవైపు.. వెరసి.. మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల నిర్మాణ పనులపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం చొరవ తీసుకొని బహుళ వినియోగ ఫంక్షన్హాళ్లను సకాలంలో అందుబాటులోకి తీసుకువచ్చి వందలాది మందికి ప్రయోజనం చేకూర్చాలని స్థానికులు కోరుతున్నారు.