సిటీబ్యూరో, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను వసూలులో నిర్ధేశిత లక్ష్యాన్ని అధిగమించడం అధికారులకు సవాల్గా మారింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఆరు జోన్ల పరిధిలో రూ.2100 కోట్ల టార్గెట్ను విధించారు. అయితే ప్రస్తుతం మంగళవారం నాటికి దాదాపు రూ. 1186 కోట్ల మేర వసూలు అయింది.
ఇంకా రూ.914 కోట్ల మేర లక్ష్యాన్ని అందుకోవాల్సి ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికలతో రెండు నెలల పాటు ఆస్తిపన్ను వసూలులో వేగం తగ్గింది. టార్గెట్ను పూర్తి చేయడంపై కమిషనర్ ఆస్తిపన్ను బకాయిలపై దృష్టి సారించారు. పన్ను వసూళ్లలో వేగం పెంచాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగానే రూ.914 కోట్ల బకాయిలలో ఈ నెలాఖరు నాటికి రూ.231 కోట్ల లక్ష్యాన్ని ఖరారు చేశారు. ఇప్పటి వరకు ఎక్కువగా ఖైరతాబాద్లో రూ.300 కోట్ల మేర వసూలు చేసింది.
ఈ ఆర్థిక సంవత్సరం నాలుగు నెలలలో నెలకు సరాసరి రూ.240 కోట్ల లక్ష్యంతో కార్యాచరణ ప్రణాళికలను అమలు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సిబ్బందికి వీక్లీ టార్గెట్లు ఇవ్వాలని, ఫలించకుంటే రోజువారీ టార్గెట్లు ఇచ్చి వసూళ్లు రాబట్టాలని ప్లాన్ చేస్తున్నారు. అధికారుల కార్యాచరణ అమలు మాత్రం క్షేత్రస్థాయిలో కష్టసాధ్యంగానే ఉంటుందంటూ సిబ్బంది చెబుతున్నారు. పండుగలు, పార్లమెంట్ ఎన్నికలు ప్రధాన అడ్డంకిగా మారే అవకాశాలు కనబడుతున్నాయని పేర్కొంటున్నారు.