సిటీబ్యూరో, సెప్టెంబర్ 26(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరంలో గృహ నిర్మాణాలకు అనుమతి పొంది ఆ తర్వాత వాటిని వాణిజ్యం, వ్యాపార కార్యకలాపాల కేంద్రాలుగా నిర్వహిస్తూ ఇంటి యజమానులు సొమ్ము చేసుకుంటున్న విషయం తెలిసిందే. నివాసాలకు అనుమతి పొంది వాణిజ్యానికి ఉపయోగించడం అక్రమమని, ఇది సబబు కాదని చెప్పి ప్రభుత్వ యంత్రాంగం అలాంటి నిర్మాణాలపై దృషి కేంద్రీకరించింది. ఈ నేపథ్యంలోనే నివాస భవనంగా అనుమతి పొంది వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న భవన యాజమానులపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఈ మేరకు వాణిజ్య కారిడార్లలో జీహెచ్ఎంసీ అధికారుల బృందం ప్రత్యేక సర్వే జరుపుతోంది. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ (ఎన్ఏసీ) ద్వారా ఎంపికైన ఇంజినీర్లు, ట్యాక్స్ ఇన్స్పెక్టర్లు, బిల్ కలెక్టర్లతో కూడిన బృందాలు 118 మార్గాల్లో అన్ని భవనాలను సర్వే చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల కొత్తగా 118 మార్గాల్ని వాణిజ్య కారిడార్లుగా మార్చడం తెలిసిందే. ఈ కారిడార్లన్నీ దాదాపుగా సీఆర్ఎంపీలోని 709 కిలో మీటర్ల మేర రహదారుల మార్గాల్లోనే గడిచిన నెల రోజులుగా సర్వే చేస్తున్నారు. జీహెచ్ఎంసీ జాబితాలో నివాసంగా అనుమతులు పొందినన్నప్పటికీ ఆ తరువాత, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు ఎందరో ఉన్నారు.
నివాసంగా అనుమతి పొంది వాణిజ్యానికి మారిన భవన యాజమాలను ఆస్తిపన్ను జాబితాలో చేర్చడం ద్వారా సంస్థకు అదనపు ఆదాయం వస్తుందని భావించి ఈ సర్వే చేస్తున్నారు. ఇందులో భాగంగానే గడిచిన నెల రోజుల సర్వేలో దాదాపు 200లకు పైగా వాణిజ్యానికి మారిన భవనాలకు నోటీసులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ జాబితాలో నివాస భవనంగా ఉండి, ప్రస్తుతం వాణిజ్య కార్యకలాపాలు కొనసాగుతున్న భవన యాజమానులకు వాటిని వాణిజ్య కేటగిరిలోకి మార్చుకోవాలని సూచిస్తూ నోటీసులు ఇస్తున్నారు. పదిహేను రోజుల్లోగా నివాసం ఉంచి వాణిజ్య కేటగిరికి మార్చుకోవాలని, లేనిపక్షంలో జీహెచ్ఎంసీ చట్టం, నిబంధనల మే రకు ఫెనాల్టీ పడుతుందని సదరు నోటీసులో పేర్కొంటున్నారు. కేటగిరి మార్పు ఆన్లైన్లో ఎలా మార్చుకోవాలో తెలిపే వివరాలతో కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు.