సిటీబ్యూరో, జూలై 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో పచ్చదనం పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్ జిల్లాలో 16 రెవెన్యూ మండలాల్లో ఖాళీగా ఉన్న సుమారు 250 గజాల స్థలాల్లో మినీ అర్బన్ లంగ్స్ పార్కులను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్థలాలను గుర్తించాలని కలెక్టర్ శ్వేతా మహంతి తహసీల్దార్లకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పలుచోట్ల నిరుపయోగంగా ఉన్న 250 గజాల విస్తీర్ణంలోని సుమారు 250 నుంచి 300 వరకు ఉన్న ఖాళీ స్థలాలను గుర్తించారు. వీటిని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు అప్పగించి అందులో మినీ అర్బన్ లంగ్స్ పార్కులు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
సేకరించిన స్థలాల్లో చిట్టడవులను పెంచనున్నారు. నగర శివారుల్లోని రిజర్వ్ ఫారెస్ట్ స్థలాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 30 నుంచి 40 అర్బన్ లంగ్స్ పార్కులకు ప్రకృతి ప్రేమికుల నుంచి విశేష ఆదరణ లభిస్తున్నది. ఈ క్రమంలో హైదరాబాద్లోని కాలనీ, బస్తీ వాసులకు అందుబాటులో ఉండేలా మినీ అర్బన్ లంగ్స్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక ఈ పార్కులు అందుబాటులోకి వస్తే కాలనీ వాసులకు పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణం అందడం ఖాయం.