బంజారాహిల్స్, జనవరి 12: సరైన జాగ్రత్తలు తీసుకోకుండా పెంపుడు కుక్కను వదిలిపెట్టి స్విగ్గీస్ డెలివరీ బాయ్ గాయపడేందుకు కారణమైన మహిళపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని శ్రీరాంనగర్కు చెందిన మహ్మద్ రిజ్వాన్ (23) మూడేండ్లగా స్విగ్గీస్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఈనెల 9వతేదీ రాత్రి పదిన్నర ప్రాంతంలో బంజారాహిల్స్ రోడ్ నం. 6, లుంబినీ రాక్ కాజిల్ అపార్ట్మెంట్స్లోని మూడో ఫ్లోర్లో ఉంటున్న శోభన నాగానికి ఫుడ్ పార్సల్ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. ఫ్లాట్ వద్దకు వెళ్లి డోర్ కొట్టగానే.. లోపల నుంచి శోభనకు చెందిన జర్మన్ షెఫర్డ్ కుక్క అతడి మీదకు వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన రిజ్వాన్ కిందకు పరుగులు పెట్టాడు.
ఈ క్రమంలో రెయిలింగ్ మీద నుంచి కిందపడిన రిజ్వాన్ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫ్లాట్ యజమాని శోభన స్థానికుల సాయంతో అతడిని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిజ్వాన్ పరిస్థితి విషమంగా ఉంది. ఇదిలా ఉండగా.. డెలివరీ ఇచ్చేందుకు వెళ్లిన తన సోదరుడు ప్రమాదానికి గురికావడానికి ఫ్లాట్ ఓనర్ శోభన కారణమని, కుక్కను కట్టేయకుండా నిర్లక్ష్యం వహించడంతో రిజ్వాన్ ప్రాణాపాయంలో ఉన్నాడంటూ అతడి సోదరుడు మహ్మద్ ఖాజా గురువారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కుక్క యజమాని శోభన నాగాని పై ఐపీసీ 336, 289 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.