సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అనేది సుదీర్ఘమైందే కాకుండా ఎన్నో సవాళ్లతో కూడుకున్నదని ఆర్ఈ సస్టెయినబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ గౌతం రెడ్డి అన్నారు. వరల్డ్ ఎర్త్ డేను పురస్కరించుకొని నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, ఆర్ఈ సస్టెయినబిలిటీ సంయుక్తంగా ప్రమాదకర వ్యర్థాల నిర్వహణ అనే అంశంపై శుక్రవారం గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో సదస్సును నిర్వహించారు. సదస్సులో గౌతం రెడ్డి కీలకోపన్యాసం చేశారు. దేశంలో ప్రమాదకర వ్యర్థ పదార్థాల నిర్వహణను ప్రారంభంలోనే గుర్తించినా, దానికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, నియంత్రణ లేకపోవడం వల్ల పురోగతి నెమ్మదిగా ఉందన్నారు. ఈ అంశంపై ఒక్క మనదేశానికే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉందని పేర్కొన్నారు.
వ్యర్థాల నుంచి వినూత్న పరిష్కారాలను కనుకొనడానికి అందరూ కలిసి పనిచేయాల్సి ఉంటుందని, ఇది చాలా ఖర్చుతో కూడుకున్నదని, పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ కంపెనీ వ్యర్థాల నిర్వహణ చేపట్టిందన్నారు. ఈ సదస్సులో ఈఎస్సీఐ డైరెక్టర్ డాక్టర్ జి. రామేశ్వర్రావు, ఆర్ఈఎస్ డైరెక్టర్ ప్రొఫెసర్ పీ.జి.శాస్త్రి, నేషనల్ ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డిప్యూటీ డైరెక్టర్ అండ్ హెడ్ (మాజీ) డాక్టర్ పీ.వీ.ఆర్.సుబ్రహ్మణ్యం, అస్సాం పీసీబీ చైర్మన్ అరుప్కుమార్ మిశ్రా, సీపీసీబీ మెంబర్ డాక్టర్ ప్రశాంత భార్గవ, ఆర్ఈఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ కె.శ్రీనివాస్, నీరి డైరెక్టర్ డాక్టర్ అతుల్ నారాయణ్ వైద్య, దాల్మియా సిమెంట్ ప్రతినిధి ముఖేష్ సిన్హా, సీపీసీబీ సెంటిస్టు బి.వినోద్బాబు తదితరులు పాల్గొన్నారు.