ఏపీ టూ యూపీకి 300 కేజీల గంజాయి..
ప్రమాదం జరగడంతో బయటపడిన బాగోతం
కీసర ఓఆర్ఆర్పై లారీని ఢీకొట్టిన కారు
ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఉన్న వాహనంపై కీసర పోలీసుల దర్యాప్తు
దవాఖానలో ఇద్దరు..పరారీలో మరో ఇద్దరు..
సిటీబ్యూరో, జూన్ 13(నమస్తే తెలంగాణ) / కీసర : కీసర ఓఆర్ఆర్పై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం గంజాయి స్మగ్లింగ్ బాగోతాన్ని బయటపెట్టింది. ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకోగా కారులో దాదాపు 300 కేజీలకు పైగా గంజాయి దొరికింది. ఈ ప్రమాద సమయంలో కారులో ఉత్తరప్రదేశ్కు చెందిన శివం పాండే (25), దుర్గేశ్ పాండే(28), సోనిపాండే (28), గుర్తు తెలియని మరో వ్యక్తి మొత్తం నలుగురు ఉన్నారు. వీరిలో శివంపాండే, దుర్గేశ్ పాండేలకు తీవ్రగాయాలకు గురై అపస్మారకస్థితిలో దవాఖానలో చికిత్సలు పొందుతున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.
స్మగ్లర్లు కారుకు ముందు వెనకాల ప్రభుత్వ చిహ్నం స్టికర్ను వేసుకుని దానిపై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని రాసుకుని వెళ్లడం పోలీసులను ఆశ్చర్యానికి గురి చేసింది. సోమవారం కీసర పోలీసుస్టేషన్ పరిధిలో ఉదయం 6.15 గంటలకు ఢిల్లీ రిజిస్ట్రేషన్తో ఉన్న కారు వేగంగా ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిం ది. దీంతో ముందు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఓఆర్ఆర్పై ప్రయాణిస్తున్న ఇతర వాహనదారులు ఈ ప్రమాదాన్ని చూసి పోలీసులకు డయల్ 100 ద్వారా సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న కీసర పోలీసులు ప్రమాదాన్ని పరిశీలించి కారును తనిఖీ చేయగా అందులో దాదాపు 300 కేజీల గంజాయి దొరికింది. దీంతో పోలీసులు అప్రమత్తమై కారు నెంబరు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. ఏపీ నుంచి యూపీకి గంజాయిని సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు విచారణలో స్పష్టమైంది. పరారీలో ఉన్నవారి కోసం సీసీ కెమెరాలను పోలీసులు జల్లెడపడుతున్నారు. రాచకొండ పోలీసులు ఈ గంజాయి సరఫరా ముఠాను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు.