మన్సూరాబాద్, అక్టోబర్ 29: అరటి పండ్ల రవాణా ముసుగులో గంజాయి వ్యాపారం చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రాచకొండ కమిషనరేట్ సీపీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీపీ మహేశ్భగవత్ వివరాలను వెల్లడించారు.జోద్పూర్ జిల్లాకు చెందిన సోలంకి (24) జీడిమెట్ల షాపూర్లో ఉంటూ వ్యాపారం చేస్తున్నాడు. తన మినీ గూడ్స్ వాహనాన్ని కూకట్పల్లి ప్రాంతంలో నివాసముండే రాజస్థాన్ వాసి మంగీలాల్కు విక్రయించాడు. అతడు డబ్బులు పూర్తిగా చెల్లించకపోవడంతో వాహనాన్ని మంగీలాల్ పేరిట రిజిస్ట్రేషన్ చేయలేదు. మంగీలాల్ ఏపీలో గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్, ఉత్తరప్రదేశ్కు సరఫరా చేసేవాడు.
మధ్యప్రదేశ్ నర్సింగ్పూర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలో తన వాహనం డబ్బుల విషయం మాట్లాడేందుకు మంగీలాల్ను నర్సింగ్పూర్ జిల్లా జైలులో కలిశాడు. అక్రమంగా గంజాయి వ్యాపారం చేయడం వల్ల వచ్చే లాభాలను మంగీలాల్ సోలంకికి వివరించాడు. విశాఖపట్నం జిల్లా పెద్దజాగేరు గ్రామానికి చెందిన మసాడ పెద్ద బాలన్న (32), స్మగ్లర్ల నుంచి కొనుగోలు చేసిన గంజాయిని అమ్ముకునేందుకు యూపీకి చెందిన రషీద్ అనే వ్యక్తుల ఫోన్ నంబర్లను ఇచ్చాడు.
ఈ నేపథ్యంలో బాలన్నను సోలంకి సంప్రదించాడు. మొదట 10 కేజీలు గంజాయి కొనుగోలు చేసి.. ఏపీ నుంచి ఆర్టీసీ బస్సులో హైదరాబాద్కు చేరవేసే వాడు. ఇక్కడి నుంచి ప్రైవేటు వాహనాల్లో నాగ్పూర్లో రషీద్కు సరఫరా చేసేవాడు. గంజాయి వ్యాపారంలో పెద్ద ఎత్తున లాభాలు వస్తుండటంతో 10 కేజీ నుంచి 20 కేజీల వరకు కొనుగోలు చేసి అక్రమ రవాణా చేస్తూ..డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. తన మిత్రుడైన కిష్ణారామ్కు మినీ ట్రాన్స్పోర్టు వాహనం ఉండటంతో అతడి సహకారం తీసుకున్నాడు. ఈ క్రమంలో 28న 110 కేజీల గంజాయిని పెద్ద బాలన్న వద్ద కొనుగోలు చేసి.. దానిపైభాగంలో అరటిపండ్లు పెట్టారు. సరుకును రషీద్కు అందజేసేందుకు బయలుదేరారు.
ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు శుక్రవారం మినీగూడ్స్ వాహనాన్ని అబ్దుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఔటర్ రింగ్రోడ్డు వద్ద పట్టుకున్నారు. రూ. 18.50 లక్షల విలువైన 110 కేజీల గంజాయి, వాహనాన్ని, 3 సెల్ఫోన్లు, రూ. 1100 నగదును స్వాధీనం చేసుకున్నారు. సోలంకి, కిష్ణారామ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరో ఇద్దరు నిందితులు బాలన్న, రషీద్ పరారీలో ఉన్నారు. కాగా, ఐదేండ్లలో గంజాయి అక్రమ రవాణాపై 160 పైగా కేసులు నమోదు చేశామని సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. సుమారు 7 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు.