కంటోన్మెంట్, జనవరి 9: నార్త్జోన్ టాస్క్ఫోర్స్, బోయిన్పల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి, గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకున్నారు. మంగళవారం బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉత్తర మండల అదనపు డీసీపీ మధుసూదన్ రావు విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. రాజమండ్రి నుంచి రెండు వాహనాల్లో గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు నిఘా పెంచి, తనిఖీలు చేపట్టారు. బోయిన్పల్లిలోని డైమండ్ పాయింట్ హోటల్ సమీపంలో రెండు కార్లలో గంజాయి లభించింది. రాజస్థాన్కు చెందిన నిందితులు జీడిమెట్లలో నివాసముంటున్నారు. వీరిలో జైసింఘ్ భట్ (44), రూప్ చంద్(27), ప్రేమ్ కుమార్ పరిమార్ (35) కలిసి అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నారు.
పట్టుబడిన నిందితుల నుంచి రూ.32 లక్షల విలువజేసే 130 కేజీల నిషేధిత గంజాయితో పాటు, రెండు కార్లు, మూడు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ప్రధాన సూత్రదారులు, మధ్యవర్తులుగా ఉన్న మరో ముగ్గురు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అదనపు డీసీపీ మధుసూదన్ రావు తెలిపారు. ఈ సమావేశంలో ఏసీపీ రామలింగరాజు, ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్సైలు రాజు, నాగేంద్ర బాబు, టాస్క్ఫోర్స్ పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు.