మైలార్దేవ్పల్లి : ఏటీయం సెంటర్లలో అమాయకుల ఏటీయం కార్డులు మార్చి డబ్బులు కాజేస్తున్న ముఠాను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. గురువారం మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నర్సింహ మాట్లాడుతూ.. కాటేదాన్ టీఎన్జీవోస్ కాలనీకి చెందిన అజయ్ షా (24) మెకానిక్ , విపిన్ కుమార్ షా (21) లేబర్.
ఇద్దరు జల్సాలకు అలవాటు పడి ఏటీయం సెంటర్లను అడ్డాగా మార్చుకుని ఏటీయం సెంటర్లలో డబ్బులు డ్రా చేసేందుకు వచ్చే అమాయకులను మోసం చేస్తున్నారు. డబ్బులు డ్రా చేసిస్తామని నమ్మించి డ్రా చేసే సమయంలో వారి పిన్ నెంబర్ ను గుర్తు పెట్టుకుని, చేశాక వారికి మరో కార్డును అంటగడుతున్నారు.
అనంతరం వారు అక్కడి నుండి వెళ్లగానే మార్చిన కార్డుతో వారి అకౌంటులో ఉన్న మొత్తాన్ని కాజేస్తున్నారు. గతంలో వీరిపై అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. టీఎన్జీవోస్ కాలనీకి చెందిన బాలరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఏటీయం సెంటర్ల వద్ద అనుమానితులుగా ఉన్న ఇద్దరిని విచారించగా వారు చేసే మోసాలను వివరించారు.
దీంతో ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించి కేసునమోదు చేశారు. మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.