HomeHyderabadGanesha Idols Are Being Immersed At 74 Mini Ponds Set Up By Ghmc
74 మినీ చెరువుల్లో గణపయ్యల నిమజ్జనం
గ్రేటర్లో వినాయక ప్రతిమల నిమజ్జన కోలాహలం ఊపందుకున్నది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 74 మినీ కొలనుల వద్ద వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తున్నారు.
క్రేన్లతో సహా అన్ని ఏర్పాట్లు చేసిన బల్దియా
సిటీబ్యూరో, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ ) : గ్రేటర్లో వినాయక ప్రతిమల నిమజ్జన కోలాహలం ఊపందుకున్నది. ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు గణేశ్ నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన 74 మినీ కొలనుల వద్ద వినాయక ప్రతిమలను నిమజ్జనం చేస్తున్నారు. ప్రతి ఏటా తరహాలోనే జీహెచ్ఎంసీ 23 ప్రదేశాలలో ఎక్సావేటర్ (డ్రగ్ పాండ్), 24 పోర్టబుల్ వాటర్ ట్యాంక్లు, 27 చోట్ల బేబీ పాండ్స్ను ఏర్పాటు చేసి నిమజ్జనంకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వీటితో పాటు చెరువుల వద్ద జీహెచ్ఎంసీ ప్రత్యేక సిబ్బందిని సమకూర్చారు. ఇంజినీరింగ్, మెడికల్, రెవెన్యూ బృందాలతో పాటు పోలీస్, ట్రాఫిక్, విద్యుత్, జలమండలి, ఆర్టీసీ, ఫైర్ స్టేషన్ సిబ్బంది సమన్వయంతో నిమజ్జన ప్రక్రియను సజావుగా సాగేలా చర్యలు చేపడుతున్నారు.
ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జన ప్రక్రియలో ఎలాంటి ప్రమాదాలు తలెత్తకుండా జీహెచ్ఎంసీ సిబ్బంది స్వయంగా వినాయక ప్రతిమలను నిమజ్జనం జరుపుతున్నారు. డీఆర్ఎఫ్, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచారు. బేబీ పాండ్స్ వద్ద ప్రత్యేకంగా క్రేన్ల సహాయంతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. చివరి రోజు ఖైరతాబాద్ భారీ మట్టి గణపతి మినహా అన్ని విగ్రహాలను హుస్సేస్సాగర్ వైపు కాకుండా మినీ కొలనులలోనే నిమజ్జనం చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే మినీ కొలనుల వద్ద ప్రత్యేక సందడి నెలకొంది. కాగా కొలనుల వద్ద పెద్ద ఎత్తున ఏర్పడిన చెత్త, వ్యర్థ పదార్థాలు ఎప్పటికప్పుడు తొలగించడానికి చర్యలు చేపడుతున్నారు.