ఖైరతాబాద్, సెప్టెంబర్ 6: భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ నిర్లక్ష్యం వీడాలని కమిటీ ఉపాధ్యక్షులు మహేశ్ యాదవ్, భిక్షపతిలు కోరారు. ఖైరతాబాద్లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సలహాదారులు ఎం.మహేందర్ బాబు, అనిల్ కుమార్ యాదవ్తో కలిసి మాట్లాడారు. 67 ఏండ్లుగా ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కార్యవర్గం ఉన్నప్పటికీ సభ్యులందరినీ సంప్రదించకుండా కేవలం ఒకే కుటుంబానికి చెందిన వారు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని వారు తెలియజేశారు. గణేశుని చుట్టు పక్కల మొత్తం పదివేల మంది కుటుంబాలతో నివసిస్తున్నారని, నలు దిక్కులా బారికేడ్లు నిర్మించడంతో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఆఫీసుకు పోయే ఉద్యోగులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి సరైన దారి కల్పించాలని ఉత్సవ కమిటీని మంత్రి ఆదేశించారని, అయినా, కొందరు అధికారులు, ఉత్సవ కమిటీ వారు పట్టించుకోవడం కమిటీ ఉపాధ్యక్షులు పేర్కొన్నారు.
ప్రతి ఏడాది కోట్లాది రూపాయలు భక్తుల కానుకల రూపంలో వస్తాయని, పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు ఎన్ని కానుకలు వేస్తున్నారనేది బహిరంగ పర్చాలని, వాటిని ఎవరి సంక్షేమానికి వినియోగిస్తున్నారని చెప్పాలన్నారు. జవాబుదారిగా లేనప్పుడు కమిటీని వెంటనే రద్దు చేయాలన్నారు. ఖైరతాబాద్లో మంత్రి హరీశ్ రావు చొరవతో ఎమ్మెల్యే దానం నాగేందర్ 50 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అర్థరాత్రి వరకు మైకుల హోరుతో రోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఉత్సవ కమిటీ సభ్యులు చెబుతున్నారు. చుట్టు పక్కల నివాస ఉండే వారికి అసౌకర్యం ఉంటుందని, శబ్ద కాలుష్యం పెరిగిందన్నారు. స్థానికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గణేశుని వెనుక వైపు రోడ్డు నిర్మాణానికి తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక చొరవతో రోడ్డు నిర్మాణానికి రూ.40 లక్షలు అత్యవసరంగా మంజూరు చేయించారని, కానీ, ఉత్సవ కమిటీలోని కొందరి చర్యలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం జరుగలేదని, ఈ కారణంగానే స్థానిక ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు బిక్షపతి, రాజు, ప్రసాద్, సూరి పాల్గొన్నారు.