సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జనం.. ప్రతి సంవత్సరం కంటే ఈ ఏడాది భిన్నంగా జరిగింది. భారీ గణనాథుల శోభాయాత్రల ‘మహా’ సంబురం ముందుగా ముగించారు. గణేశ్ విగ్రహాలను నిమజ్జనం చేసే ప్రక్రియలో భాగంగా అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో పాటు పక్కా వ్యూహంతో వ్యవహరించడంతో ప్రశాంతంగా ముగిసింది. ప్రధానంగా గణేశ్ మండపాల నిర్వాహకులపై పోలీసులు ఎలాంటి ఒత్తిడి తేకపోవడంతో గణనాథులు ఒక్కొక్కటిగా నిమజ్జనానికి సాగర్ వైపు కదిలాయి. ‘జై బోలో గణేశ్ మహరాజ్ కీ జై నినాదాలతో గురువారం విఘ్ననాథుడి శోభాయాత్ర నేత్ర పర్వంగా సాగింది. పదకొండు రోజుల పాటు పూజలందుకున్న పార్వతి తనయుడు ఆశేష జనవాహిని నడుమ ఇక వస్తానంటూ గంగమ్మ ఒడిలో ఒదిగిపోయాడు.
ఈ పదకొండు రోజుల ప్రక్రియలో శాఖల మధ్య సమన్వయం ఫలించింది. వినాయక నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు గణేశ్ ఉత్సవ సమితి నిర్వాహకులతో సంప్రదింపులు జరిపారు. ఎక్కువ శాతం మట్టి గణపతులనే పూజించాలని పెద్ద ఎత్తున అవగాహన కల్పించి దాదాపు 6 లక్షల వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఇక నిమజ్జన ఏర్పాట్లలోనూ రాజీ పడకుండా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు తతెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఏకంగా ఉత్సవాలకు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేసిన ప్రభుత్వం ఏ చిన్న సంఘటనలు తలెత్తకుండా పక్కాగా వ్యవహరించింది.
నిమజ్జన కార్యక్రమంతో పాటు సాగర తీరానికి తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం జీహెచ్ఎంసీ, ఎలక్ట్రిసిటీ, ఆర్అండ్బీ, పోలీస్, వాటర్వర్క్స్, సాంస్కృతిక శాఖ తదితర శాఖల ఆధ్వర్యంలో విస్తృత సౌకర్యాలు కల్పించి సేవల్లో బేష్ అనిపించారు. కమిషనర్ నుంచి శానిటేషన్ వర్కర్ దాకా మహా నిమజ్జనంలో కమాండ్ కంట్రోల్ రూం ద్వారా నిరంతర పర్యవేక్షణ జరిపారు. శోభాయాత్ర నిర్వహించే మార్గాలో 48,179 లైట్లను సమకూర్చారు. హుస్సేన్సాగర్, సరూర్నగర్తో పాటు 33 చెరువుల వద్ద 250మంది స్విమ్మర్లు, 400 మంది డీఆర్ఎఫ్ బృందాలు, పీవోపీ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా 74 బేబీ పాండ్స్ను ఏర్పాటు చేసి నిమజ్జనం జరిపారు. నగరం నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులకు మొబైల్ టాయిలెట్లు, స్టాటిక్ టాయిలెట్లు ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు.
వినాయక నిమజ్జనానికి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చడానికి జలమండలి 122 ప్రత్యేక తాగునీటి శిబిరాలను ఏర్పాట్లు చేసి వాటర్ ఫ్యాకెట్లను పంపిణీ చేశారు. 74 బేబీ పాండ్ (నీటి కొలనులు) వద్ద క్యాంపుతో పాటు గణేశ్ శోభాయాత్ర, ఊరేగింపు జరిగే ప్రాంతాలు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం తదితర ప్రాంతాలలో శిబిరాల ద్వారా 33.50 లక్షల వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తాగునీటి శిబిరాలను ఎండీ దానకిశోర్ తనిఖీ చేశారు. ట్యాంక్బండ్, నెక్లెస్రోడ్, పీపుల్ప్లాజా పరిసరాల్లో ఉన్న శిబిరాలను సందర్శించిన ఎండీ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. నీటి నాణ్యత, క్లోరిన్ పరీక్షల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు.
హుస్సెన్ సాగర్లో బోటులో తిరుగుతూ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): గణేశ్ నిమజ్జం సందర్భంగా ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఓటరు నమోదుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సాగర్ ప్రధాన కూడాలిలోని కంట్రోల్ రూం, గణేశ్ శోభాయాత్ర, నిమజ్జన ప్రాంతాల్లో ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సహకారంతో పోస్టర్లు, కరపత్రాల ద్వారా అవగాహన కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు. స్వీప్ నోడల్ అధికారి డాక్టర్ అబ్దుల్ వకీల్ నేతృత్వంలో నియోజకవర్గ సహాయ స్వీప్ నోడల్ అధికారులు వలంటీర్ల సహకారంతో ప్రత్యేకమైన డ్రెస్ కోడ్తో పాటు టోపీ ధరించి ప్రచారం చేశారు. ఓటర్ జాబితాలో పేరులేని వారు ఈసీఐ వెబ్ సైట్ voters.eci.gov.in ద్వారా తిరిగి నమోదు చేసుకోవచ్చునని కమిషనర్ చెప్పారు.