గణేశ్ నవరాత్రి ఉత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలనుంచి కూడా భక్తులు హాజరవుతారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ప్రభుత్వం నుంచి అన్ని రకాల సౌకర్యాలను కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. విగ్రహాల ఎత్తు విషయంలో ఎటువంటి ఆంక్షలు లేవని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవచ్చని ఆయన ఉత్సవ నిర్వాహకులకు స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 10నుంచి 19వ తేదీవరకు నగరంలో జరుగనున్న వినాయక చవితి నవరాత్రి వేడుకల ఏర్పాట్లపై శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీహెచ్ఆర్డీ)లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డితోపాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, పలు శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఇండ్లల్లో మట్టి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
కొవిడ్ నిబంధనల మేరకు ఉత్సవాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో వైద్య,ఆరోగ్య సిబ్బందితో పాటు అంబులెన్స్లు అందుబాటులో ఉంచాలని కోరారు. ట్రాఫిక్, విద్యుత్ సమస్యలు ఎదురుకాకుండా ఆయా విభాగాల అధికారులు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హుస్సేన్సాగర్, మినీ ట్యాంక్బండ్ ప్రాంతాల్లో బోట్లు, స్విమ్మర్లను అందుబాటులో ఉంచాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 70వేలు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 50వేలు, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 40వేల మట్టి విగ్రహాలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.ఉత్సవాలు శాంతియుతంగా జరిగేలా అందరూ సహకరించాలని ప్రజాప్రతినిధులు, అధికారులు, భాగ్యనగర ఉత్సవ కమిటీ సభ్యులకు మంత్రి విజ్ఞప్తిచేశారు.
మంత్రి తలసాని మాట్లాడుతూ బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర మార్గంలో రోడ్డు మరమ్మతు నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు. ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనానికి పోలీసులు సహకరించాలని కోరారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి ప్రాంతాల విగ్రహాల నిమజ్జనం విషయంలో సమస్యల పరిష్కారానికి త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఏడాది గణేశ్ విగ్రహాల సంఖ్యను బట్టి కావాల్సినన్ని క్రేన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అత్యధికంగా విగ్రహాల నిమజ్జనం జరిగే హుస్సేన్సాగర్, సరూర్నగర్, మినీ ట్యాంక్బండ్, సఫిల్గూడ, మీరాలం తదితర చెరువుల్లో పూడిక తొలగింపు పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండపాల వద్ద పారిశుధ్యం, డ్రైనేజీ సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయాలన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రభుత్వం అన్ని పండుగలను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నదని, అదే విధంగా ఈసారి గణేశ్ ఉత్సవాలను కూడా ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు.
వినాయక నిమజ్జన ఉత్సవ కమిటీ సహా వేడుకల నిర్వాహకులు కోరిన విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గతంలో కంటే ఈ ఏడాది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ఇందుకు అనుగుణంగా అధికారులు సిద్ధంగా ఉండాలని ఆయన కోరారు.