బన్సీలాల్పేట్, ఆగస్టు 3 : గాంధీ దవాఖానలో మంగళవారం నుంచి అన్ని రకాల వైద్య సేవలు ప్రారంభించారు. అత్యవసర సేవలు, ఓపీ, ఐపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. తొలిరోజు సుమారు రెండు వందల మంది బయటి రోగులు వైద్య సేవల కోసం దవాఖానకు వచ్చారు. ఉదయం 8.30 నుంచి 11 గంటల వరకు ఓపీ సేవలు అందించారు. మెట్ల వెనకాల ఉన్న ఫార్మసీని ఓపీ గేటు పక్కన ఉన్న కేంద్రంలోకి మార్చారు. అక్కడ ఉన్న జీవన్ధారా ఫార్మసీని బయటకు మార్చారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, నోడల్ అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఆర్ఎంఓ డాక్టర్ ప్రభుకిరణ్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ దవాఖాన ప్రధాన భవనంలోని రెండు, మూడు అంతస్తులను కొవిడ్ రోగుల సేవలకు, నాల్గవ అంతస్తును బ్లాక్ ఫంగస్ రోగుల సేవలకు కేటాయించామని తెలిపారు. 250 ఐసీయూ బెడ్లను కొవిడ్ రోగులకు, మిగతా అంతస్తుల్లో ఉన్న వార్డులను, ఐసీయూ వార్డులను సాధారణ రోగుల సేవలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఒకవేళ మూడవ దశ లాంటిది వచ్చినా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.