సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): మాతా శిశుమరణాలను నివారించేందుకు గాంధీ దవాఖానలో ప్రత్యేకంగా మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకున్నది. భారీ వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ మాతాశిశు సంరక్షణ కేంద్ర భవనం ఎనిమిది అంతస్తులతో నిర్మించేందుకు అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత తెలుగు రాష్ర్టాల్లోనే తొలిసారిగా మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిలోఫర్ దవాఖానలో నిర్మించిన విషయం తెలిసిందే. 500పడకల సామర్థ్యంతో నిలోఫర్ దవాఖానలో మాతా శిశు సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసి ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నారు. ఈ తరహాలోనే గాంధీ దవాఖానలో కూడా మాతా శిశు సంరక్షణ కోసం ప్రత్యేకంగా మదర్ అండ్ చైల్డ్ కేర్ యూనిట్ను నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే గాంధీ ఆవరణలో ఉన్న పాత భవనాలను కూల్చివేసి భూమిని చదును చేశారు.
రూ.100కోట్లతో 8అంతస్తుల భవనాన్ని మాతా శిశు సంరక్షణ కేంద్రం కోసం నిర్మించనున్నట్లు గాంధీ వర్గాలు తెలిపాయి. 200పడకల సామర్థ్యంతో నిర్మించనున్న ఈ ప్రత్యేక భవనంలో తల్లీబిడ్డకు సంబంధించిన అన్నిరకాల స్పెషాల్టీ సేవలను అందుబాటులో ఉంచనున్నారు. నిలోఫర్ తరహాలో మదర్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కంగారు మదర్ కేర్ యూనిట్, ఎన్ఐసీయూ లెవల్-1, 2, 3,4, ఎస్ఎస్సీయూ తదితర ప్రత్యేక వార్డులను నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.
దవాఖాన నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఎంసీహెచ్ అనుమతి సైతం లభించినట్లు సమాచారం. అత్యాధునిక వైద్య సదుపాయాలు, ఆధునిక పద్ధతులతో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని నిర్మించేందుకు టీఎస్ఎంఐడీసీ ప్రణాళిక రూపొందించింది. నిర్మాణానికి సంబంధించి త్వరలోనే భూమి పూజ చేసి నిర్మాణ పనులు మొదలు పెట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సుమారు ఏడాదిన్నరలోపు గాంధీ మాతా శిశు సంరక్షణ కేంద్రం నిర్మాణ పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయని దాదాపుగా 2023లో ఈ భవనం రోగులకు అందుబాటులోకి రావచ్చని అధికారుల అంచనా.