మారేడ్పల్లి, ఆగస్టు 30: వినాయక చవితి వేడుకలకు సికింద్రాబాద్ గణపతి ఆలయం ముస్తాబైనది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ ఈఓ, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. వివిధ రంగులు, పువ్వులు, విద్యుత్ కాంతులతో ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ఈ నెల 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగనున్నాయి.
ఈ నెల 31న ఉదయం 5 గంటలకు శ్రీ మృణ్మయ గణపతి మూర్తిని శ్రీ పాండు రంగనాథ దేవాలయం నుంచి ఆలయ లాంచనములతో శ్రీ గణపతి దేవాలయమునకు తీసుకొని వచ్చి ప్రతిష్టించుట, 6 గంటలకు శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీ మహా గణపతి స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, మూల మంత్ర గణపతి హోమం, సాయంత్రం 6 గంటలకు దీపాలంకరణ సేవ, శ్రీ సిద్ధి బుద్ధి సమేత మహా గణపతి స్వామి వారికి, రాత్రి 10:30 గంటలకు ద్వార బంధనము. 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో నిత్య పూజలతో పాటు వివిధ వాహన సేవలు, ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరుగనున్నాయి. 2వ తేదీన శ్రీ సిద్ధి బుద్ధి సమేత శ్రీమహా గణపతి కళ్యాణము, సాయంత్రం 6 గంటలకు రాజ దర్బారు, 4వ తేదీన ఉదయం 10:30 గంటలకు శ్రీ గణపతి స్వామి వారికి బిల్వార్చన, 6వ తేదీన శ్రీ సత్య గణపతి వ్రతం, 7వ తేదీన 11:00 శ్రీ వినాయక శాంతి, 9వ తేదీన సాయంత్రం 4 గంటలకు రథోత్సవం, ట్యాంక్బండ్లో గణనాథుడి నిమజ్జన కార్యక్రమాలు ఉంటాయి. ఇందుకు గాను ఆలయ అధికారులు, సిబ్బంది భక్తులకు మంచినీటి సదుపాయం, క్యూలైన్లు, ప్రత్యేక ప్రసాద కౌంటర్లు తదితర వసతులను ఏర్పాట్లు చేశారు.