ఉస్మానియా యూనివర్సిటీ : ఊరిఊరికో జమ్మిచెట్టు, గుడిగుడికో జమ్మిచెట్టు ఉండాలనే సంకల్పంతో గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ జోగినపల్లి సంతోష్కుమార్ పిలుపు మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని సరస్వతీ ఆలయం లో తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ జమ్మి మొక్కను నాటారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
టీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల సతీశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గాదరి కిశోర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం పేరుతో పచ్చదనాన్ని పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో ముందుకుపోతోందని గుర్తు చేశారు. ప్రతి ఊరిలో, గుడిలో జమ్మిచెట్టు నాటాలనే ఆలోచన గొప్పదన్నారు. రాష్ట్రంలో అతిపెద్ద పండుగ అయిన దసరా రోజు జమ్మిచెట్టు దగ్గరికి పోవడం, జమ్మి ఆకు మార్చుకోవడం, పాలపిట్టను సందర్శించడం అనే సంప్రదాయాలను గౌరవించుకోవడంతో పాటు, అంతరించిపోతున్న జమ్మిచెట్టును కాపాడుకోవడంలో భాగంగా శమీమొక్కను ఓయూలో నాటడం అదృష్టంగా భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
దుర్గామాత స్వరూపమైన శమీ చెట్టును పూజిస్తే శని తొలిగిపోతుందని, అనేక ఔషదగుణాలున్న ఈ మొక్కను నాటితే మంచిదని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పల్లా ప్రవీణ్రెడ్డి, వల్లమల కృష్ణ, బండారి వీరబాబు, మంద సురేశ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండగాని కిరణ్గౌడ్ తదితరులు పాల్గొన్నారు