రూ.4.50 కోట్లు విడుదల
‘మన బస్తీ- మన బడి’కి 14 పాఠశాలల ఎంపిక
మారనున్న కంటోన్మెంట్లోని సర్కారు బడుల
తొలిసారిగా డైనింగ్ హాళ్ల పనులు
నేడు బోయిన్పల్లి ప్రభుత్వ బడిలో
ప్రారంభం కానున్న పనులు
త్వరలోనే ప్రవేశపెట్టనున్న ఆంగ్ల విద్య
సికింద్రాబాద్, మే 25: ‘మన ఊరు-మన బడి, ‘మన బస్తీ- మన బడి’లో భాగంగా ప్రతి సర్కార్ బడుల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ తరహాలో నాణ్యమైన విద్యను అందించడంతో పాటు ఇంగ్లిషు మీడియంను కూడా ప్రవేశ పెట్టేందుకు సంకల్పించింది. దీంతో కంటోన్మెంట్లోని 14 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మూత్ర శాలలు, వంట గదులు, డైనింగ్ హాళ్లు, తాత్కాలిక మరమ్మతులు, ఫర్నిచర్, విద్యుద్ధ్దీకరణ, పెయింటింగ్, తాగునీటి సరఫరా, మేజర్, మైనర్ రిపేర్లకు నోచుకోనున్నాయి
పాఠశాలల్లో పనులు ప్రారంభం
పాఠశాలల్లో చేపట్టాల్సిన పనులపై సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి మంజూరు కోసం ఇప్పటికే నివేదించారు. అంతా ఆన్లైన్లో ప్రతిపాదనలు పంపించారు. కాగా, కంటోన్మెంట్లో 14 పాఠశాలల్లో పనులు చేపట్టేందుకు రూ. 4.50 కోట్లతో ప్రభుత్వంకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో అనుమతి లభించింది. పనులు కూడా ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టారు. దీంట్లో భాగంగా ఇటీవలే మడ్ఫోర్డ్లోని ప్రభుత్వ పాఠశాలలో ఆధునీకరణ పనులను సుమారు రూ.29.50లక్షలతో ప్రారంభించారు. ఈ క్రమంలోనే నేడు బోయిన్పల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దాదాపు రూ.29.50లక్షలతో మౌలిక వసతుల కల్పన, ఆధునీకరణకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న శంకుస్థాపన చేయనున్నారు.
మరోవైపు పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన భవనాలను కూల్చి వేయడంతో పాటు ఆయా పాఠశాల భవనాలు స్థితిగతులు, మంజూరైన నిధులను బట్టి పనులు చేపట్టనున్నారు. దీనికి తోడు పాఠశాలల్లోని ఉపాధ్యాయులుకు ఇంగ్లిషు మీడియంలో బోధనపై తర్ఫీదు ఇచ్చారు.
పెరగనున్న వసతులు
‘మన ఊరు-మన బడి, మన బస్తీ- మన బడి’తో పాఠశాలల్లో మౌలిక వసతులు పెరగనున్నాయి. అన్ని రకాల వసతులు కల్పించడంతో పాఠశాలల రూపు రేఖలు మారనున్నాయి. తాగునీరు, మూత్రశాలల ఏర్పాటుతో విద్యార్థులకు ఈ సమస్య తీరనుంది. వచ్చే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో ఉంచుకుని పాఠశాలల్లో పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం.
– జి. సాయన్న, ఎమ్మెల్యే, కంటోన్మెంట్