వర్షపు నీరు నిలువకుండా చర్యలు ప్రారంభం
డ్రైన్ ఏర్పాటుకు రూ.30.64లక్షలు
మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో నిధులు మంజూరు
ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు
కందుకూరు, డిసెంబర్ 11: జాతీయ రహదారిపై ఎన్నో ఏండ్లుగా ఉన్న వాన నీటి సమస్య తీరనుంది.. తిప్పలు లేకుండా ప్రయాణం సాగనుంది. హైదరాబాద్, శ్రీశైలం జాతీయ రహదారి విస్తరణ సమయంలో కందుకూరు వద్ద వాననీరు వెళ్లడానికి పరిష్కారం చూపలేదు. దీంతో వాన వచ్చిందటే చాలు రహదారిపై నీరు నిలుస్తుంది. దీంతో అటు అచ్చంపేట, శ్రీశైలం వైపు, ఇటు హైదరాబాద్ వైపు వచ్చే వాహనాల ప్రజలు అనేక ఇబ్బందులతో పాటు ప్రమాదాలు కూడా జరిగాయి.
ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరువ తీసుకోకపోవడంతో సమస్యను పరిశీలించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమస్యను పరిష్కరించాలని జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడారు. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ రహదారుల అధికారులు చొరువ తీసుకొని జాతీయ రహదారిపై మండల కేంద్రంలో ఉన్న సమస్య పరిష్కారానికి అంగీకరించి వర్షపు నీరు వెళ్లడానికి డ్రైన్ ఏర్పాటుకు రూ.30.64లక్షలు మంజూరు చేశారు. దీంతో ఎన్నో ఏండ్లుగా ఉన్న సమస్యకు మోక్షం కలుగడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి చొరవతో..
రాష్ట్ర విద్యాశాక మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో వాననీటి సమస్యకు పరిష్కారం లభించనుంది. నిధుల మంజూరు కోసం జాతీయ రహదారుల అధికారులతో మంత్రి మాట్లాడారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ పాలకులు పట్టించుకోలేదు. ఎట్టకేలకు సమస్యకు మోక్షం లభించింది.
సంతృప్తికరంగా ఉంది..
కందుకూరు వద్ద శ్రీశైలం, హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న సమస్యను స్వయంగా చూశా.. కేంద్ర ప్రభుత్వంతో పాటు జాతీయ రహదారుల అధికారుల దృష్టికి తీసుకెళ్లి సెంట్రల్ లైటింగ్, డ్రైనేజీకి రూ.4.32కోట్లు విడుదల చేయించాను. డ్రైనేజీకి రూ.30.64లక్షలు, మిగిలిన నిధులు సెంట్రల్ లైటింగ్ కోసం వినియోగిస్తారు. సమస్య పరిష్కరించినందుకు సంతృప్తికరంగా ఉంది.