హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ తరాలకు ఆరోగ్య ప్రదాయినిగా ‘నీరా’ను అందించాలనే సంకల్పంతో రూ.20 కోట్లతో హైదరాబాద్లోని నెక్లస్రోడ్లో నీరా కేఫ్ను ఏర్పాటు చేస్తున్నామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. దాదాపు ఆరు నెలలు నిల్వ ఉండేలా ప్రాసెస్ చేసిన నీరా తయారీపై పరిశోధనలు చేస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లతో శుక్రవారం మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పరిశోధనలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో గీత వృత్తిదారుల సంక్షేమం, గీత వృత్తిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో నీరా పాలసీని ప్రవేశపెట్టారన్నారు. ఓయూ మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ హెడ్ డాక్టర్ భీమా, ప్రొఫెసర్లు డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ శ్రీనివాస్ నాయక్ మంత్రితో భేటీ అయ్యారు. నీరాపై ఎన్నో పరిశోధనలు చేసి, మెరుగైన ఫలితాలు సాధించామని మంత్రికి వివరించారు.