సిటీబ్యూరో, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ): చెరువుల ఆక్రమణలపై నగరంలో జరుగుతున్నది ఒకటైతే.. చెరువుల హద్దుల నిర్ధారణ తప్పుల తడకలా సాగుతుందని పర్యావరణవేత్తలు మొదటి నుంచి ఆందోళన చెందుతున్నారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం చెరువులను పరిరక్షిస్తున్నది తామేనని, ఏ ఒక్క చెరువు భూములను కూడా కబ్జా కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని మాటల్లో చెబుతుంది. కానీ చేతల్లో మాత్రం హద్దుల నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ గుర్తింపులో తప్పులు జరుగుతుండటంపై ఇప్పుడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు చెరువుల ఆక్రమణలపై రాష్ట్ర సర్కారు ఏం చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించడంతో.. నగరంలో హద్దుల నిర్ధారణ తీరు ఎంత డొల్లతనంతో జరుగుతుందనేది స్పష్టమైతుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే నగరంలో చెరువులు, శిఖం భూముల ఆక్రమణలు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లోని నిర్మాణాల కూల్చివేతలపై దృష్టి పెట్టింది. దీనికి అనుగుణంగానే అశాస్త్రీయ విధానాలు, అడ్డగోలు హద్దులను సవరించకుండానే చర్యలు తీసుకున్నది. కానీ అసలు ఆక్రమణలపై తీసుకున్న చర్యలకు వాస్తవిక ఆధారాలపై మొదటి నుంచి అనుమానాలే ఉన్నాయి. ఇదే నగరంలో అడ్డగోలుగా జరుగుతున్న హద్దుల నిర్ధారణలోనూ తేలింది. కానీ హెచ్ఎండీఏ మాత్రం రెండేళ్లలో శరవేగం హద్దుల నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ గుర్తింపు సాగిందని, ఇప్పటివరకు 2500కు పైగా చెరువులను నోటిఫై చేశామంటూ ప్రకటించుకున్నది.
బయటపడిన డొల్లతనం..
నగరంలో చెరువుల పరిరక్షణ అంశాన్ని హైకోర్టు పర్యవేక్షణలో ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సాగిన హద్దుల నిర్ధారణపై ఉన్నత న్యాయస్థానం ప్రత్యేక దృష్టి పెట్టింది. రెండేళ్లుగా కొనసాగుతున్న ఈ ప్రక్రియ సాగుతుంది. కానీ హద్దుల నిర్ధారణలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని పలువురు పర్యావరణ కార్యకర్తలు కోర్టును ఆశ్రయించారు. హెచ్ఎండీఏ నిర్వహిస్తున్న హద్దుల నిర్ధారణ తప్పులతడకలా మారిందని, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్ధారణ సరిగా లేదని వాదించారు.
మూడు జిల్లాల పరిధిలో విస్తరించిన ఉన్న చెరువులను కేస్ స్టడీస్గా పేర్కొనడంతో అసలు విషయం బయటపడింది. ఇందులో రంగారెడ్డి జిల్లా పరిధిలో మల్కం చెరువు, సంగారెడ్డి జిల్లాలోని అమీన్పూర్ చెరువు, మేడ్చల్ జిల్లా పరిధిలోని చిన్న చెరువు, హైదర్గూడలోని కిందికుంట ఎఫ్టీఎల్లో జరిగిన లోపాలను వెలికితీశారు. ముఖ్యంగా చెత్తచెదారం నిండి, భవన నిర్మాణ వ్యర్థాలతో నింపుతున్న కూడా అధికారులు పట్టించుకోలేదన్నారు. కనీసం అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నా, అధికారుల పర్యవేక్షణ లోపంతో చెరువు భూము లు అన్యాక్రాంతం అవుతున్నాయని, సర్కారు వైఫల్యాలను బయటపెట్టారు.
మొదటి నుంచి వివాదంగానే..
రెండేళ్లుగా సాగుతున్న చెరువుల హద్దుల నిర్ధారణపై హైకోర్టు సీరియస్గానే ఉంది. ముఖ్యంగా ఎఫ్టీఎల్, బఫర్జోన్ సమాచారంలో ఇరిగేషన్, హెచ్ఎండీఏ వద్ద మ్యాపుల మధ్య వ్యత్యాసం ఎందుకనే అంశం మొదటి నుంచి వివాదంగానే ఉంది. కానీ సర్కారు ఈ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేసేలా, వాస్తవిక చెరువుల హద్దులను నిర్ధారణ జరగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇవే అంశాలపై హైకోర్టు గత కొంత కాలంగా హెచ్ఎండీఏపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. పనితీరులో ఎలాంటి మార్పు లేదని విమర్శలు వస్తున్నాయి. తాజా విచారణలోనూ హెచ్ఎండీఏ తప్పిదానికి రెండు వారాల్లోగా రూ. 5వేలు జరిమానా చెల్లించాలని ఆదేశించింది.