ఎల్బీనగర్, సెప్టెంబర్ 29 : తెలుగు రాష్ర్టాల్లో అతిపెద్ద పండ్ల మార్కెట్గా పేరుగాంచి లక్షలాదిమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పించిన కొత్తపేటలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ ప్రస్థానం ముగిసింది. ఇక్కడ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించాలని నిర్ణయించడంతో పండ్ల మార్కెట్ను నగరశివారు బాటసింగారంలోని లాజిస్టిక్ పార్కుకు తరలిస్తున్నారు. ఈ నెల 25న క్రయవిక్రయాలు నిలిచిపోగా, అక్టోబర్ 1 నుంచి బాటసింగారంలోనే అమ్మకాలు జరగనున్నాయి. మార్కెట్ ప్రధాన ద్వారాలకు తాళాలు వేయడంతో నిత్యం కిటకిటలాడే పరిసరాలు బోసిపోయాయి. రద్దీగా ఉంటూ ట్రాఫిక్ చిక్కులకు కేంద్రంగా ఉన్న మార్కెట్ తరలింపుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
1986లో జాంబాగ్లో ఉన్న పండ్ల మార్కెట్ను నగరశివారు కొత్తపేటకు తరలించారు. అప్పట్లో జనసంచారం తక్కువ. దూర ప్రాంతాల నుంచి సరుకు వాహనాలు సులువుగా వచ్చిపోయేవి. ప్రస్తుతం ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందడంతో నిత్యం ట్రాఫిక్ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద పండ్లమార్కెట్గా పేరొందిన గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ 22 ఎకరాల్లో విస్తరించి ఉంది.
ప్రధానంగా మామిడి, సంత్రాలు, బత్తాయి,
ఆరెంజ్, ఆపిల్, ద్రాక్ష, పుచ్చకాయలు, మస్క్మిలన్, పైనాపిల్, పొపాయ, సపోట విక్రయిస్తారు. మార్కెట్యార్డులో 341మంది కమీషన్దారులు లావాదేవీలు నిర్వహిస్తారు.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను గతేడాది తాత్కాలికంగా కోహెడకు తరలించారు. భారీ వర్షాలకు తోడు వసతులు లేవని వ్యాపారులు పట్టుబట్టడంతో తిరిగి గడ్డిఅన్నారానికి తరలించారు. కోహెడలో 178 ఎకరాల్లో అన్ని వసతులతో అధునాతనంగా మార్కెట్ను నిర్మించాలని గతంలోనే ప్రభుత్వం నిర్ణయించింది.
గడ్డిఅన్నారం పండ్లమార్కెట్కు విదేశాల నుంచి నేరుగా పండ్లు దిగుమతువుతున్నాయి. ముఖ్యంగా ఆపిల్స్, కివీ, డ్రాగన్ ప్రూట్, పియర్స్, ఆరెంజస్, ఆల్బుకారా, బ్లూబెర్రీ, చెర్రీ వస్తుంటాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది కంటే ఈ ఏడాది 30 శాతం పండ్ల అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను బాటసింగారం తరలించే పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే మార్కెట్ కమిటీ కార్యాలయంలోని ఫర్నిచర్, ఇతర సామగ్రిని తరలించారు. వ్యాపారులు బాటసింగారం వెళ్లబోమంటూ భీష్మించుక కూర్చుంటున్నప్పటికీ అధికారులు బాటసింగారంలో విక్రయాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ను బాటసింగారం లాజిస్టిక్ పార్కుకు తరలించాం. అక్టోబర్ 1 నుంచి బాటసింగారంలోనే విక్రయాలు జరుగుతాయి. హైకోర్టు ఆదేశాల మేరకు వ్యాపారులకు నెల గడువు ఇచ్చాం. లాజిస్టిక్ పార్కులో వ్యాపారాలకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కమీషన్ ఏజెంట్లంతా బాటసింగారం వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. వ్యాపారుల్లో కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారు. – పద్మహర్ష, గడ్డిఅన్నారం పండ్లమార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ తరలింపుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేరింది. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు మార్కెట్ ప్రాంగణంలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం కానుంది. బాటసింగారంలో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. వ్యాపారులకు మరికొంత సమయమిచ్చే విషయాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. – దేవిరెడ్డి సుధీర్రెడ్డి, ఎమ్మెల్యే