సిటీబ్యూరో, మే 28(నమస్తే తెలంగాణ): పోలీసు ఉన్నతాధికారుల డీపీలు ఉపయోగించి మోసం చేస్తున్న ఘటనలు అప్పుడప్పుడు జరుగుతుంటాయి. తాజాగా జరిగిన ఘటనలో తానే కమిషనర్నంటూ ఫేస్బుక్లో ఓ సైంటిస్ట్ను సైబర్ నేరగాళ్లు పరిచయం చేసుకొని, తన స్నేహితుడు ఆర్మీలో పనిచేస్తున్నాడు, ఫర్నిచర్ అమ్ముతున్నాడంటూ నమ్మించి రూ.20 వేలు సాప్ట్వేర్ ఉద్యోగికి బురిడీ కొట్టించారు. తాను మోసపోయానని గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి.సుమతి పేరు, ఫొటోతో సైబర్ నేరగాళ్లు ఫేస్బుక్ ఖాతాను తెరిచి కొందరికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. రామంతాపూర్కు చెందిన ఓ సాప్ట్వేర్ ఉద్యోగికి కూడా ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తనకు పోలీస్ కమిషనరే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారని భావించిన బాధితుడు రిక్వెస్ట్కు ఒకే చెప్పాడు. రెండు రోజుల తరువాత బాధితుడి వాట్సాప్ నెంబర్కు తాను ఐపీఎస్ అధికారి సుమతి అంటూ మేసేజ్ వచ్చింది.
ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ చాటింగ్ చేస్తున్న వ్యక్తి… తన స్నేహితుడు సంతోష్కుమార్ సీఆర్పీఎఫ్లో అసిస్టెంట్ కమాండెంట్గా పనిచేస్తున్నాడు, అతడికి బదిలీ కావడంతో ఇంట్లో ఉన్న ఫర్నిచర్ను విక్రయిస్తానంటున్నాడంటూ మేసేజ్ పంపించారు. మీకు సదరు వ్యక్తి ఫోన్ చేస్తాడని, ఏదైనా ఉంటే అన్నింటికి తాను బాధ్యత వహిస్తానంటూ నమ్మించారు. బాధితుడికి తరువాత సంతోష్కుమార్ పేరుతో మేసేజ్లుపెట్టి, ఫర్నీచర్ ఫోటోలు పంపించారు. రూ.85 వేలకు మొత్తం ఫర్నిచర్ను విక్రయిస్తానంటూ చెప్పడంతో బాధితుడు రూ.20 వేలు ఆన్లైన్లో పం పించాడు. ఇదంతా మోసమని గుర్తించి బాధితుడు వెంటనే మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.