చాదర్ఘాట్:మలక్పేట నియోజకవర్గం లోని పిల్లిగుడిసెల డబుల్ బెడ్రూంలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. శుక్రవారం లబ్ధిదారులు సామూహిక గృహప్రవేశాలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.2 బ్లాక్లలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లను అత్యంత నాణ్యత ప్రమాణాలతో నిర్మించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురికివాడల స్వరూపం మార్చేందుకు ప్రభుత్వం ఆధునిక హంగులతో డబుల్ బెడ్ రూం ప్రాజెక్ట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందె.
మలక్పేట నియోజకవర్గం పరిధిలో భారీ స్థాయిలో మొదటి సారిగా డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతుండడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పిల్లిగుడిసెల డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. పిల్లిగుడిసెల్లో ఇంతకుముందు నివాసముండే 134 పాక్షిక పక్కా ఇళ్లు, 7 కచ్చా ఇళ్లను జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించి ఇళ్లను నేలమట్టం చేశారు.. గుడిసెవాసుల వివరాలను ఐరిష్ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో సేకరించారు.
2 బ్లాక్లలో డబుల్ బెడ్రూంల నిర్మాణం
స్టిల్ట్ +9 అంతస్థులతో 2 బ్లాక్లలో నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. లబ్ధిదారులు తొమ్మిది అంతస్తులకు ఎక్కేందుకు వ్యయాప్రయాసాలు పడాల్సిన పని లేకుండా నాలుగు చోట్ల లిష్ట్సౌకర్యం కూడా కల్పించారు. లిష్ట్ ఇతర పనుల నిర్వహణ కోసం గ్రౌండ్ ఫ్లోర్ లో 19 వాణిజ్య దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. వాణిజ్య దుకాణాల పై వచ్చే అద్దెను లిష్ట్ తదితర నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. మొత్తం 1.5ఎకరాల స్థలంలో రెండు(ఏ, బి) బ్లాక్ లలో స్టిల్ట్+9 నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి.
మలక్పేట నియోజకవర్గంలోని చంచల్గూడ-సైదాబాద్ ప్రధాన రోడ్డు పై పిల్లిగుడిసెల వద్ద నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్లు పెద్ద ల్యాండ్ మార్క్గా గుర్తింపు పోందనున్నాయి. బహుళ అంతస్థులతో సామాన్య ప్రజల కోసం నిర్మిస్తున్న డబుల్బెడ్ రూం ఇండ్లు అందరిదృష్టిని ఆకర్శిస్తున్నాయి. ఇళ్ల నిర్మాణంలో కూడా నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఒక్కో ఫ్లాట్ 570 చ.అడుగుల సామర్థ్యంతో నిర్మాణం జరుగుతుంది.
2 బెడ్ రూంలు, ఒక హాలు, వంట గది, ఒక అటాస్డ్ వాష్రూం, మరొకటి కామన్ వాష్ రూం ను 570ఎస్ఎఫ్టీలో నిర్మిస్తున్నారు. మొత్తం తొమ్మిది అంతస్థుల్లో డబుల్ బెడ్ రూం ఇండ్లు ఆధునిక హంగులతో నిర్మాణమవుతున్నాయి.
శుక్రవారం గృహప్రవేశాలు
పిల్లిగుడిసెలు డబుల్బెడ్రూం ఇండ్ల సామూహిక గృహప్రవేశాలకు ముస్తాబవుతుంది. శుక్రవారం నాడు గృహప్రవేశాలు చేసేందుకు లబ్ధిదారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. శుక్రవారం డబుల్బెడ్ రూం ఇళ్లు లబ్ధిదారులకు అప్పగించ నున్నారు. ఈ నెల 14న గృహప్రవేశాలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.