నేరేడ్మెట్, ఆక్టోబర్ 7: నిరంతర సాధకులుగా యువ న్యాయవాదులు వారి సేవలందించాలని మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీఆర్ మధుసూదన్ రావు సూచించారు. నేరేడ్మెట్ డిఫెన్స్ కాలనీలోని నిమ్మగడ్డ సత్యవతి వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం యువ న్యాయవాదులకు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందుకు బీఆర్ మధుసూదన్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత శిక్షణ తరగతులు యువ న్యాయవాదులకు ఎంతో ఉపయోగపడుతాయని అన్నారు.
ఈ తరగతులు అన్ని జిల్లాలతో పాటు మండల స్థాయి యువ న్యాయవాదులకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వ్యక్తిగత పట్టింపులతో కక్షిదారులు న్యాయానికి దూరం కాకుండా న్యాయవాదులు వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. భాష పట్ల శ్రద్ధ వహించడం యువ న్యాయవాదులకు వృత్తిలో ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అదనపు న్యాయమూర్తి ఆర్.రఘునాథ రెడ్డి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ డి.కిరణ్ కుమార్, ప్రిన్సిపాల్ సీనియర్ సివిల్ జడ్జ్ కె.పూజ, తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ కె.సునీల్ గౌడ్, మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె.రామ చంద్రారెడ్డి, ఐఎల్పీఏ అధ్యక్షుడు పొన్నమ్ దేవరాజు గౌడ్, ఐఎల్పీఏ జనరల్ సెక్రటరి ఎన్.జె.శ్యాంసన్, గంగేయుడు, సురేష్, సందీప్ గౌడ్, గుర్జిత్ సింగ్, బాలాజీ, రాములు, క్రిష్ణయ్య, తిరుపతి రెడ్డి, గిరి, జూనియర్ సీనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.