పేద రోగులకు అండగా మల్లారెడ్డి దవాఖాన
జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి
ఘట్కేసర్ రూరల్, మార్చి 26 : మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాలను పేదలు సద్వినియోగం చేసుకోవాలని మేడ్చల్ జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని ఎదులాబాద్లో మల్లారెడ్డి దవాఖాన ఆధ్వర్యంలో శనివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా 554 మంది రోగులకు గుండె, కంటి, దంత, షుగర్, బీపీ, గర్భ, చర్మ సంబంధిత వ్యాధులకు పరీక్షలు చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మల్లారెడ్డి హెల్త్సీటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు ఆయా గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, సర్పంచ్ సురేశ్, ఉప సర్పంచ్ లింగేశ్వర్ రావు, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కుమార్, నాయకులు బాల్రాజు పాల్గొన్నారు.
నాగారం మున్సిపాలిటీలో..
మేడ్చల్ కలెక్టరేట్ : నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సత్యనారాయణ కాలనీలో ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 200 మందికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు అందజేశారు. చైర్మన్ కౌకుట్ల చంద్రారెడ్డి , నాయకులు శ్రీనివాస్, సురేశ్, ట్రినిటీ దవాఖాన వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.