పోటీ పరీక్షల్లో ఉద్యోగార్థులు విజయం సాధించేలా ప్రభుత్వం చేయూతనిస్తున్నది. ప్రతి నియోజకవర్గానికో శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. హైదరాబాద్ జిల్లాలో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో అదనంగా మరో 15 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నది. మెరిట్ ఆధారంగా ఒక్కో బ్యాచ్కు 100 మందిని ఎంపిక చేసి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుశిక్షితులైన అధ్యాపకులతో శిక్షణ ఇప్పించనున్నది. అంతేకాక ఈ ఉచిత శిక్షణా కేంద్రాలకు వచ్చే ఉద్యోగార్థులకు ఆహారం, రవాణా ఖర్చుల కింద రూ.5 వేల వరకు అధికారులు చెల్లించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక పడుతున్న ఇబ్బందులను గుర్తించే ఈ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. మరోవైపు బీసీ, ఎస్సీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోచింగ్ సెంటర్లలో తరగతులు ప్రారంభించామని.. మైనార్టీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చార్మినార్లోని ఉర్దూ మాస్కాన్ హాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లో ఈ నెల 6 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ): పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల సౌకర్యార్థం ప్రతి నియోజకవర్గంలో అదనంగా ఒక కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. ఈ కోచింగ్ సెంటర్లకు వస్తున్న అభ్యర్థులకు ఒక్కొక్కరికీ భోజనం, రవాణా ఖర్చుల నిమిత్తం ప్రభుత్వం నెలకు రూ. 5 వేల చొప్పున చెల్లిస్తుందని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్లు పనిచేస్తున్నాయి. వాటికి అదనంగా హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఈ ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సోమవారం మాసాబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు.
అభ్యర్థులకు
ఉపకార వేతనం..
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల్లో అనేక మంది నిరుపేదలు ఉన్నారని, వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేరని, ఇబ్బందులు పడుతారని సమీక్షలో చర్చించారు. వారిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసిందని వివరించారు. ఈ కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒకొక్కరికి నెలకు రూ. 5 వేల ఉపకారవేతనం ప్రభుత్వం ఇస్తుందని తెలిపారు. మెరిట్ ఆధారంగా ఒకో బ్యాచ్కు 100 మంది చొప్పున ఎంపిక చేసి, ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుభవజ్ఞులైన వారితో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.
ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగ అభ్యర్థులకు శిక్షణ..
ఉస్మానియా యూనివర్సిటీలో కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి, ఏప్రిల్ 27 నుంచి గ్రూప్ -1 శిక్షణ తరగతులు ప్రారంభించినట్లు జేడీ అలోక్ కుమార్ తెలిపారు. ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఈనెల 7 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. మైనారిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చార్మినార్లోని ఉర్దూ మసాన్ హాల్లో ఏర్పాటు చేసిన సెంటర్లో ఈనెల 6 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభించనున్నట్లు సంబంధిత అధికారులు వివరించారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిజాం కళాశాలలో ఏర్పాటు చేసిన సెంటర్లో ఏప్రిల్ 29 నుంచి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు ఎంఎస్ ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణీదేవి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, బీసీ వెల్ఫేర్ జేడీ అలోక్, డీడీ ఆశన్న, ఎస్సీ కార్పొరేషన్ డీడీ రామారావు, మైనారిటీ వెల్ఫేర్ డీడీ ఖాసీం, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.