ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, ఆరోగ్యమే లక్ష్యంగా పాలించిన నాటి బీఆఎర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన పలు ఆరోగ్య కార్యక్రమాలు నిరుపేదలకు పునర్జీవనాన్ని ప్రసాదిస్తున్నాయి. ఐవీఎఫ్ కేంద్రాలు సంతానం లేని అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. సంతానలేమితో బాధపడే దంపతులు ప్రైవేటు దవాఖానలు, సంతాన సాఫల్యకేంద్రాల చుట్టూ తిరుగుతూ, ఆస్తులు అమ్ముకున్న ఉదంతాలు ఉన్నాయి. కోటి దేవుళ్లకు మొక్కడం ఒక ఎత్తైతే దవాఖానల చుట్టూ తిరగడం మరో ఎత్తు. కొన్ని ప్రైవేటు సంతాన సాఫల్య కేంద్రాలు సొమ్ముచేసుకుంటూ అమాయక దంపతులను నిలువుదోపిడీ చేస్తున్న ‘సృష్టి’ వంటి ఘటనలు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాం. నిరుపేద దంపతులకు సంతాన భాగ్యం కల్పించాలనే సదుద్దేశంతో నాటి కేసీఆర్ సర్కార్ 2018లో సర్కార్ దవాఖానల్లో ఐవీఎఫ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. నగరంలోని గాంధీ, పేట్లబుర్జ్ ప్రసూతి దవాఖాన, వరంగల్ ఎంజీఎంలలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆలోచనలను వెంటనే ఆచరణలోకి తీసుకువచ్చిన నాటి బీఆఎర్ఎస్ ప్రభుత్వం 2018లోనే గాంధీ దవాఖానలో మొట్టమొదటి ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభించింది. నాటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించిన ఈ ఐవీఎఫ్ సెంటర్లో ఐయూఐ విధానం ద్వారా మందులతో 200మంది దంపతులకు సంతాన భాగ్యాన్ని కల్పించిన ఘనత గాంధీ ఐవీఎఫ్ సెంటర్ వైద్యులు సొంతం చేసుకున్నారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ)
గాంధీ దవాఖాన ఐవీఎఫ్ సెంటర్లో రెండో ప్రసవం విజయవంతంగా జరిగింది. ఐవీఎఫ్ ప్రసవంలో ఓ జంట కవల పిల్లలకు జన్మనిచ్చింది. బోయగూడ ప్రాంతానికి చెందిన గడ్డం త్రివేణి, మస్తాన్ రావు దంపతులు 13 సంవత్సరాలుగా పిల్లల కోసం యత్నిస్తున్నారు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న ఈ దంపతులు సంతానం కోసమే బోయగూడకు నివాసం మా ర్చారు. ఈ క్రమంలో ఎన్నో ప్రైవేటు దవాఖానలు తిరిగి చికిత్స చేయించుకున్నప్పటికీ ఫలితం రాలేదు. ప్రైవేటు దవాఖానల్లో 13 సైకిళ్ల ఓవ్యులేషన్ ఇండక్షన్ , ఒకసారి ఐయూఐ చికిత్స చేయించుకున్నా సంతానం కలగలేదని త్రివేణి దంపతులు తెలిపారు. చివరకు గాంధీ ఐవీఎఫ్ సెంటర్ను ఆశ్రయించగా, వైద్యులు పరీక్షలు చేసి సమస్యను గుర్తించి చికిత్స అందజేశారు. ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చినప్పటి నుంచి డెలివరీ వరకూ గాంధీలోనే అవసరమైన వైద్య సేవలు అందించారు. బుధవారం ఆ దంపతులకు ఒక పాప, బాబు జన్మించారు. ప్రస్తుతం తల్లి, శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.10 లక్షల నుంచి రూ.12లక్షల వరకు ఖర్చయ్యే అవకాశం ఉండగా, గాంధీ హాస్పిటల్లో ఉచితంగా చికిత్సతో పాటు డెలివరీ చేశారు. అమ్మతనం కోసం దంపతులు పడే కష్టాలను దృష్టిలో పెట్టుకుని నాటి కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన ఐవీఎఫ్ సెంటర్ ఎంతో మంది దంపతులకు సంతానప్రాప్తి కలిగిస్తోంది.
సిటీబ్యూరో, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్కు దీటుగా ఐవీఎఫ్ సెంటర్ను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2022లో అప్పటి వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు గాంధీ ఐవీఎఫ్ సెంటర్ అభివృద్ధి కోసం రూ.5 కోట్ల నిధులు విడుదల చేశారు. గాంధీ ఐవీఎఫ్ సెంటర్ను దశల వారీగా అత్యాధునిక వైద్యపరికరాలతో అభివృద్ధిపరిచి, 2023 అక్టోబర్ 9న పూర్తిస్థాయిలో గాంధీ ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రైవేటు కేంద్రాలకు దీటుగా అత్యాధునిక వైద్య పరిజ్ఞానం కలిగిన ల్యాప్రోస్కోపీ, అల్ట్రాసౌండ్, ఆపరేషన్ థియేటర్, మైక్రోస్కోప్, డ్రై ఇంక్యూబేటరీ, ప్రిడ్జ్, ఇంట్రాయూట్రైన్ ఇన్ సమనేషన్ (ఐయూఐ) ల్యాంప్, టెస్ట్ట్యూబ్ వార్మర్, సెఫీ మార్కెల్, కౌంటింగ్ చాంబర్, రేమీ కాంపాక్ట్ క్లీనికల్ సెంట్రీప్యూజ్, సూప్రక్లీన్ లేమినార్ ఎయిర్ప్లో క్యాబినెట్ తదితర వైద్య పరికరాలను ఈ సంతాన సాఫల్యకేంద్రంలో అందుబాటులోకి తీసుకువచ్చింది నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం.
సంతానం లేని నిరుపేద దంపతులకు సంతాన భాగ్యం కల్పించాలని కలలు గన్న నాటి సీఎం కేసీఆర్ కలలు నేడు ఫలిస్తున్నాయి. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని 2023లో పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువచ్చిన ఐవీఎఫ్ సెంటర్ పిల్లలు కలగని దంపతులకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంల్నో గడిచిన ఫిబ్రవరి మాసంలో గాంధీ ఐవీఎఫ్ సెంటర్లో విజయవంతంగా తొలి ఐవీఎఫ్ ప్రసవం జరిగింది.