అంబర్పేట, మే 26 : కరోనా సోకిన వారు ఇంట్లో కుటుంబసభ్యులకు దూరంగా ప్రత్యేక గదిలో ఉండాలి. గాలి, వెలుతురుతోపాటు అందుబాటులో వైద్యం కావాల్సి ఉంటుంది. అంబర్పేట ప్రాంతంలో మురికివాడలు అధికంగా ఉండటం, చిన్నచిన్న గదుల్లో నివాసముంటుండటంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వారికోసం అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సీబీఎన్ డిజిటల్ హెల్త్కేర్ ఫౌండేషన్తో కలిసి స్థానిక ప్రభుత్వ లకోటియా పాఠశాలలో 30 పడకల ఉచిత కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో 20 పడకలు పురుషులు, 10 పడకలు మహిళలకు కేటాయించారు. ఈ కేంద్రంలో ఆక్సిజన్ సౌకర్యంతోపాటు కావాల్సిన మందులు, భోజనాన్ని ఉచితంగా అందజేస్తారు. డాక్టర్లు, నర్సులు అందుబాటులో ఉంటారు. గురువారం ఈ కేంద్రాన్ని ఎమ్మెల్యే కాలేరు ప్రారంభించనున్నారు.