విలేకరుల సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ్ వెల్లడి
సికింద్రాబాద్, మార్చి 16: సికింద్రాబాద్లో త్వరలోనే నిరుద్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు. సీతాఫల్మండిలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దశాబ్దాల కలగా నిలిచిన తుకారాంగేటు ఆర్యూబీ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని తన హయాంలోనే చేపట్టి విజయవంతంగా పూర్తి చేశామని అన్నారు. అదేవిధంగా, సీతాఫల్మండి నుంచి ఉస్మానియా క్యాంపస్, మాణికేశ్వర్నగర్ వంటి వివిధ ప్రాంతాల రాకపోకలకు రైల్వే ట్రాక్ అడ్డుగోడగా నిలుస్తుండటంతో రైల్వే ట్రాక్ కింది నుంచి ఆర్యూబీ నిర్మించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. సుమారు రూ. 20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. మెట్టుగూడ నుంచి ఆలుగడ్డ బావి మీదుగా చిలకలగూడ ప్రధాన మార్గంలోని ఆర్యూబీ విస్తరణకు తాము చేసిన సూచనకు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపి రూ. 30 కోట్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు.
సీతాఫల్మండి కుట్టి వెల్లోడి ప్రభుత్వ సివిల్ ఆసుపత్రిని 35 పడకల నుంచి 70 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన కొత్త భవన సముదాయాలను రూ.9.30 కోట్లతో త్వరలోనే నిర్మించనున్నట్లు చెప్పారు. సికింద్రాబాద్ పరిధిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ/డిగ్రీ కళాశాల లేని లోటును తీర్చామని, విద్యార్థులకు అవసరమైన తరగతి గదుల కోసం కొత్త భవన సముదాయ నిర్మాణానికి రూ.10 కోట్లతో శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 81 వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపిన నేపథ్యంలో సికింద్రాబాద్ పరిధిలోని నిరుద్యోగులకు మంచి కోచింగ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. త్వరలో స్టడీ సర్కిల్ను కూడా ఏర్పాటు చేయనున్నామని, నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.