కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 23: విదేశాలలో చదువు, ఉద్యోగం తదితర అంశాలపై మోజుతో ఉద్యోగార్థులు, విద్యార్థులు పలు కన్సల్టెన్సీ సంస్థల ఉచ్చులో పడి మోసపోతున్నారు. కెనడా, ఆస్ట్రేలియా, యూఎస్, యూకే లాంటి దేశాలలో ఉద్యోగం కల్పిస్తామని మోసపూరితమైన వాగ్దానాలతో కపట కన్సల్టెన్సీ సంస్థలు లక్షలాది రూపాయలను దండుకుంటున్నాయి. అమాయకుల్ని కెనడాకు పంపిస్తానని.. లక్షల్లో డబ్బులు వసూలు చేసిన కన్సల్టెన్సీ నిర్వాహకులు.. కోట్ల రూపాయలు వసూలు చేసి పరారయ్యారు. ఈ ఘటనపై కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా న్యాయం జరగట్లేదని బాధితులు మొరపెట్టుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే మరోసారి కమిషనర్ను కలిసి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, విజయవాడకు చెందిన ఎస్.రత్నకాంత్, భార్య అపర్ణ, బావమర్ది ప్రవీణ్లు కలిసి కేపీహెచ్బీ కాలనీ అడ్డగుట్టలో కాంత్ కన్సల్టెన్సీని ఏర్పాటు చేశారు. కూకట్పల్లిలో నివాసముంటూ పదేండ్లుగా కన్సల్టెన్సీని కొనసాగిస్తున్నారు. కాగా.., ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కెనడాకు వెళ్లేందుకు వీసా ప్రాసెస్ కోసం ఏప్రిల్లో రూ.11 లక్షలకు పైగా డబ్బులు చెల్లించాడు. ఇతని తమ్ముడు సైతం రూ.11 లక్షలు చెల్లించాడు. ఇద్దరు కలిసి కెనడా వెళ్లేందుకు సిద్ధం కాగా, వీసా ప్రాసెస్ మాత్రం పూర్తి కాలేదు. దీనిపై కన్సల్టెన్సీ నిర్వాహకులను వివరణ కోరితే ఆలస్యమవుతుందని చెబుతూ సాగదీస్తున్నారు. కాగా.. ఈ కన్సల్టెన్సీ మోసాలపై గత రెండు నెలల క్రితమే కొంత మంది బాధితులు కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుసుకున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి, కాంత్ కన్సల్టెన్సీ చేతిలో తాను కూడా మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నారు.
గతంలో ఈ కాంత్ కన్సల్టెన్సీ మోసాలపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిర్వాహకులైన అపర్ణ, ప్రవీణ్లు పరారీలో ఉన్నారని, కేవలం రత్నకాంత్ మాత్రమే బయట సమాధానాలు చెబుతున్నట్టు పేర్కొన్నారు. గతంలో వీరిపై ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్థులకు నోటీసులు పంపిస్తూ.. కరోనా సమయంలో తాను నష్టపోయామని బాధితులందరూ చెల్లించిన డబ్బులను తిరిగి ఇస్తానని పేర్కొన్నాడు. కానీ.. ఇంతవరకు ఆ డబ్బులు ఇవ్వకపోవడం.. మరోవైపు కొత్తవారిని కూడా ఉచ్చులోకి లాగి డబ్బులు లాగుతున్నట్లు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో ఒక్కొక్కరి వద్ద రూ.10 లక్షల నుంచి 18 లక్షల చొప్పున 10 మంది వద్ద రూ.1.40 కోట్లు డబ్బులు తీసుకున్నట్లు బాధితులు గుర్తించారు. పది మంది బాధితులతో పాటు మరి కొద్ది మంది పోలీసు ఉన్నతాధికారులు (కమిషనర్)ను కలుస్తామని తెలిపారు.