కాచిగూడ, అక్టోబర్ 26: తక్కువ ధరకు బంగారం అమ్ముతామని మాయమాటలు చెప్పి మోసం చేసిన వ్యక్తులపై కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. కాచిగూడ అడిషనల్ ఇన్స్పెక్టర్ యాదేందర్ కథనం ప్రకారం.. మల్లేపల్లి ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్దుల్ అఫ్రోజ్ ల్యాబ్ టెక్నీషియన్. ముంబాయికి చెందిన వికాస్ గౌతం అనే వ్యక్తి ఫేస్బుక్లో కిలో బంగారం కేవలం రూ.42 లక్షలు మాత్రమేనని ప్రకటన ఇచ్చాడు. ఆ ప్రకటన చూసి ఆకర్షితుడైన అఫ్రోజ్.. కిలో బంగారం కావాలంటూ వికాస్ గౌతంతో మాట్లాడగా, వికాస్ గౌతం బదులిస్తూ.. హైదరాబాద్లో మా మనిషి ఉన్నాడు.. మీ వద్దకు పంపిస్తాను.. అని చెప్పాడు. వికాస్గౌతం ఈ విషయాన్ని నగరంలో ఉంటున్న అమీత్గౌతంకు చెప్పాడు. అమీత్గౌతం విషయాన్ని తన మిత్రుడు రెడ్డికి చెప్పాడు. రెడ్డి నింబోలిఅడ్డాలో ఉంటున్న ముకేశ్, కిరణ్కు చెప్పాడు. ముకేశ్, కిరణ్ ఇద్దరు కలిసి సోమవారం సాయంత్రం కాచిగూడ రైల్వేస్టేషన్లో అఫ్రోజ్ను కలిశారు.
డబ్బులు తీసుకొని బంగారం ఇస్తామంటూ పాత కాచిగూడ ట్రాఫిక్ పోలీస్స్టేషన్ సమీపంలో ఉంటున్న ముకేశ్, కిరణ్ రూమ్కు అఫ్రోజ్ను తీసుకెళ్లారు. డబ్బులిస్తాను.. బంగారం ఇవ్వాలంటూ అఫ్రోజ్ కోరాడు. ముకేశ్, కిరణ్లు మాయమాటలు చెబుతూ అఫ్రోజ్ వద్దనున్న రూ.42 లక్షల నగదు బ్యాగును తరుమారు చేశారు. ఆ తర్వాత మీరు ఇక్కడే ఉండండి.. బంగారం తీసుకొస్తామని అఫ్రోజ్కు చెప్పిన ముకేశ్, కిరణ్ అక్కడి నుంచి ఉడాయించారు. చాలా సేపటి వరకు వారిద్దరూ రాలేదు. అనుమానంతో అఫ్రోజ్ తన వద్దనున్న బ్యాగును తెరిచి చూడగా.. బ్యాగులో నగదుకు బదులు కాగితాల కట్టలు కనిపించాయి. మోసపోయినట్లు ఆలస్యంగా గ్రహించిన అఫ్రోజ్ కాచిగూడ పీఎస్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్సై రాజేంద్రన్ తెలిపారు.