సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ పరీక్ష పాస్ అయ్యేందుకు పూజలు చేయాలని ఓ వైద్యురాలు ఆన్లైన్లో ఓ జ్యోతిష్యుడిని ఆశ్రయించి మోసపోయిన ఉదంతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. పూజలకు డబ్బులు చెల్లించినా.. పరీక్ష పాస్కాకపోవడంతో ఓ వైద్యురాలు తనను జ్యోతిష్యుడు మోసం చేశాడని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. మాదాపూర్కు చెందిన ఓ యువతి ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎలాగైనా.. పాస్ కావాలనుకుని..ఆన్లైన్లో విశ్వజిత్ ఝా పేరుతో ఉన్న వెబ్సైట్ను ఆశ్రయించింది.
అందులో ఉండే నంబర్లకు ఫోన్ చేసి విషయాన్ని చెప్పింది. ఫోన్లో మాట్లాడిన వ్యక్తి మీరు రూ. 40 వేలు చెల్లిస్తే పూజలు చేస్తామని… మీరు కచ్చితంగా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారని నమ్మించాడు. వైద్యురాలు పరీక్షకు హాజరైంది. కానీ పాస్ కాలేదు. తిరిగి జ్యోతిష్యుడిని సంప్రదించగా, అతడు ఏవేవో కారణాలు చెప్పి..ఈ సారి 100 శాతం మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత కావడం ఖాయమని తేల్చి చెప్పాడు. దీనిని నమ్మిన ఆ వైద్యురాలు మరోసారి రూ. 40 వేలు జమ చేసింది. ఫలితం ఫెయిల్ అని వచ్చింది. దీంతో తనను జ్యోతిష్యుడు మోసం చేశాడని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టారు.