బంజారాహిల్స్, జూలై 28: కరెంట్ బిల్లు చెల్లింపు పేరుతో విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తిని బురిడీ కొట్టించి, బ్యాంక్ అకౌంట్లోనుంచి రూ.45,931 నగదును కాజేసిన వ్యక్తులపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్ రోడ్ నంబర్- 3లోని అరోరాకాలనీలో నివాసముంటున్న విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి వాడ రాజగోపాల్రెడ్డికి ఈనెల 25న గుర్తు తెలియని మొబైల్ నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. కరెంట్ బిల్లు చెల్లింపులో వచ్చిన సమస్యల వల్ల రాత్రి 9.30 తర్వాత కరెంట్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని, వాటిని పరిష్కరించుకోవాలంటే బిల్లింగ్ అధికారితో ఫోన్లో మాట్లాడాలని మెసేజ్ సారాంశం. దీంతో ఆందోళనకు గురైన రాజగోపాల్రెడ్డి అతడికి (మెసేజ్ వచ్చిన నంబర్) ఫోన్ చేశాడు. అరగంటలో కాల్ చేస్తానని, ఆలోగా చెల్లించిన కరెంట్ బిల్లులు, బ్యాంక్ డెబిట్ కార్డుల వివరాలను సిద్ధంగా ఉంచుకుంటే వాటిని సరిచేస్తామని నమ్మబలికాడు.
అతడు చెప్పిన విధంగానే తన డ్రైవర్కు చెప్పి కరెంట్ బిల్లులు, చెల్లించిన రశీదులు సిద్ధంగా ఉంచుకుని కాల్ చేశాడు. తాను అన్ని బిల్లులు బ్యాంక్ ద్వారా చెల్లించానని, బకాయిలు లేవని చెప్పాడు. అయితే, తమ రికార్డుల్లో కొన్ని బిల్లులు అప్డేట్ కాలేదని, టీమ్ వ్యూయర్ ద్వారా సిస్టమ్ యాక్సెస్ ఇస్తే వెంటనే వాటిని సరి చేస్తానని గుర్తు తెలియని వ్యక్తి నమ్మించడంతో రాజగోపాల్రెడ్డి అతడికి తన కంప్యూటర్లో టీమ్ వ్యూయర్ ద్వారా యాక్సెస్ ఇచ్చాడు. అతడు సూచించిన విధంగా ఎస్బీఐ బ్యాంకు వివరాలను చెప్పడంతో లక్ష రూపాయలు విత్డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఆందోళనకు గురైన రాజ్గోపాల్రెడ్డి తన డ్రైవర్ను బ్యాంక్కు పంపించి ఆరా తీయగా.. రూ.45,931 విత్డ్రా అయినట్లు తేలింది. ఈ మేరకు బాధితుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఐపీసీ 419, 420తో పాటు 67, 67(డీ) ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.