‘సిటీబ్యూరో, జూన్ 15(నమస్తే తెలంగాణ): బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్ అమ్ముతామంటూ రూ.1.40 లక్షలు మోసం చేశారని ఓ ప్రైవేట్ ఉద్యోగి సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూకట్పల్లికి చెందిన సూర్యకు సంబంధించిన వారికి బ్లాక్ ఫంగస్ ఇంజక్షన్లు అవసరముండటంతో స్నేహితులకు తెలిపాడు. దీంతో వారు ఓ నంబర్ ఇవ్వగా.. ఫోన్ చేశాడు. దీంతో ఫోన్లో మాట్లాడిన నేరగాళ్లు డబ్బులు ముందుగా తాము చెప్పిన ఖాతాలో డిపాజిట్ చేయాలని, మందులు మీ ఇంటికి పంపిస్తామని నమ్మించారు. డబ్బు ముట్టిన తరువాత ఫోన్ స్వీచాఫ్ చేశారు. దీంతో చేసేదిలేక బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. అలాగే ఆర్టీసీ క్రాస్ ప్రాంతంలో నివాసముండే ఓ వ్యక్తికి సంబంధించిన క్రెడిట్ కార్డు వివరాలు తెలుసుకున్న సైబర్నేరగాళ్లు రూ.1.3 లక్షలు కాజేశారు.
తమ జీఎస్టీ నంబర్ను వాడుకుంటూ అమాయకులను మోసం చేస్తున్నారంటూ బషీర్బాగ్లోని మోర్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ సంస్థ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇండియా మార్ట్లో సైబర్నేరగాళ్లు మందులు విక్రయిస్తామంటూ ప్రకటనలు పెట్టుకుంటారు. ఎవరైనా వాళ్లను నమ్మి కొనేందుకు ప్రయత్నించే సమయంలో తమకు జీఎస్టీ నంబర్ కూడా ఉందని చెప్పుకుంటున్నారు. మోర్ మెడికల్ షాప్నకు సంబంధించిన జీఎస్టీ నంబర్ చూపిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. మోసపోయిన వారు జీఎస్టీ నంబర్ ఆధారంగా మోర్ మెడికల్ దుకాణం నిర్వాహకులను ప్రశ్నించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో నిర్వాహకులు తమ జీఎస్టీ నంబర్ను వాడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.