చిరువ్యాపారాలు చేసుకునే..ఒంటరి మహిళలను టార్గెట్గా చేసుకుని..లోన్లు ఇప్పిస్తానంటూ నమ్మించి మోసాలకు పాల్పడుతున్న యువకుడిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుడి నుంచి 10.4 తులాల బంగారం, సెల్ఫోన్, బైక్ను స్వాధీనం చేసుకున్నారు. గురువారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. విశాఖపట్నం కేశవరం గ్రామానికి చెందిన మెడిశెట్టి చిట్టిబాబు (25) పదవ తరగతి వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం రాజేంద్రనగర్ బుద్వేల్లో నివాసం ఉంటున్నాడు. ఆశా వర్కర్లను, హోటల్స్, పూలు, పండ్లు, కూరగాయల షాపులు నిర్వహించే 40 సంవత్సరాలు పైబడిన ఒంటరిగా ఉండే మహిళలను టార్గెట్ చేసుకుంటాడు. తక్కువ వడ్డీతో లోన్లను ఇప్పిస్తానంటూ నమ్మిస్తాడు.
ఈ క్రమంలో వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాల డిజైన్లు తనకు కావాలంటూ.. అలాంటివి చేయించుకుని తిరిగి ఇస్తానంటూ నమ్మించి.. వాటిని తీసుకుని పరారవుతాడు. ఆ తర్వాత ఆ బంగారు ఆభరణాలను కుదువపెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తాడు. ఇలా నార్సింగి పోలీస్ స్టేషన్లో ఇద్దరు మహిళలను మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి.. నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా.. నిందితుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ లోన్ల పేరిట మహిళలను మోసం చేసి అరెస్టయ్యాడు. ఇతడిపై సైబరాబాద్ పరిధిలో 4, హైదరాబాద్ పరిధిలో 1 కేసులు నమోదయ్యాయి. నిందితుడు చిట్టిబాబుపై పీడీ యాక్ట్ను విధిస్తామని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సమావేశంలో రాజేంద్రనగర్, మాదాపూర్ ఏసీపీలు, నార్సింగ్ ఇన్స్పెక్టర్, సిబ్బంది పాల్గొన్నారు.