సిటీబ్యూరో, బేగంపేట,అక్టోబర్ 18(నమస్తే తెలంగాణ): ఒక కాల్సెంటర్లో పనిచేసే హీరో అమెరికాలో పన్ను తక్కువగా కట్టి అవకతవకలకు పాల్పడే వారిని టార్గెట్ చేస్తాడు. ఇన్కమ్ ట్యాక్స్, ‘రెవెన్యూ విభాగాల నుంచి మాట్లాడుతున్నాం..మీరు సరిగ్గా పన్ను చెల్లించలేదం’టూ ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తూ..వేల కోట్ల డాలర్లను వసూలు చేస్తాడు. ఇందుకు అమెరికాలో ఉండే వారి బ్యాంకు ఖాతాలను వాడుకుంటూ.. మోసాలు చేస్తూ..భారీగా సంపాదిస్తుంటాడు. ఇటీవల వచ్చిన మోసగాళ్లు అనే చిత్రంలోని కథ ఇది. ..అచ్చం ఆ సినిమాలాగానే హైదరాబాద్ నుంచి అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశస్తులను మోసం చేసే ఓ కాల్సెంటర్పై సిటీ పోలీసులు సోమవారం రాత్రి దాడి చేసి ప్రధాన సూత్రదారిని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్లో కొందరు కాల్సెంటర్ను నిర్వహిస్తున్నారు.
ఇందులో అమెరికా, ఇంగ్లాండ్, ఐర్లాండ్ దేశాలకు సంబంధించిన పలువురి పన్ను చెల్లింపు దారుల వివరాలు సేకరించారు. వారికి ఈ కాల్ సెంటర్ నుంచి వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్(వీవోఐపీ) ద్వారా ఫోన్ చేస్తున్నారు. తాము రెవెన్యూ, కస్టమ్స్ విభాగాలకు చెందిన అధికారులమని, మీరు పన్ను ఎగ్గొట్టారని బెదిరిస్తారు. మీరు వెంటనే పన్ను బకాయికి సంబంధించిన సెటిల్మెంట్ పెనాల్టీతో పాటు చెల్లించకపోతే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామంటూ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. బేరానికి వచ్చిన వారికి సెటిల్మెంట్ చేస్తామని, ఎలాంటి కేసులు లేకుండా చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. లంచం కింద క్రిప్టోకరెన్సీని కొని దానిని ఫోన్ చేసిన వారికి పంపిస్తున్నారు. కొందరు ఈ ఫోన్లపై సందేహాలు వ్యక్తం చేస్తూ.. ఆయా దేశాల దౌత్య కార్యాలయాలకు ఫిర్యాదులు చేశారు. ఈ సమాచారం హైదరాబాద్ పోలీసులకు అందడంతో చర్యలు ప్రారంభించారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.