సిటీబ్యూరో, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ దాహార్తిని తీర్చడంలో కీలక పాత్ర పోషించే జంట జలాశయాలైన ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లకు పూర్వ వైభవం రానున్నది. కలుషిత మచ్చను శాశ్వతంగా తొలగించేందుకు జలమండలి నడుం బిగించింది. జంట జలాశయాల్లోకి మురుగునీటి ప్రవాహాన్ని అరికట్టడానికి తక్షణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం నాలుగు మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టిపి) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రూ.82.23 కోట్ల నిధులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో నం.244ను జారీ చేసింది. హిమాయత్ సాగర్ వద్ద రోజుకు 9 మిలియన్ లీటర్ల (ఎంఎల్డి) సామర్థ్యం గల రెండు, ఉస్మాన్సాగర్ వద్ద 11 ఎంఎల్డీ సామర్థ్యంతో మరో రెండు ఎస్టీపీలు రానున్నాయి.
ఎస్టీపీలతో పాటు ఇంటరాప్షన్ అండ్ డైవర్షన్ (మురుగునీటి మళ్లింపు) పనులు జలమండలి అధికారులు చేపట్టనున్నారు. కాగా జంట జలాశయాల్లోకి చుక్క మురుగునీరు రాకుండా ఉండేందుకుగానూ ప్రత్యేకంగా సివరేజీ మాస్టర్ప్లాన్ రూపకల్పన చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జలాశయాల ఎగువ ప్రాంతాలు, పరిసర ప్రాంతాలు కలిపి 22 చోట్ల మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) అవసరమని ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో భాగంగానే ఎన్సీపీఈ ఇన్ఫ్రా ఇండియా ప్రై.లి సహకారంతో నివేదిక రూపొందించిన అధికారులు, తొలి ప్రాధాన్యతలో నాలుగు చోట్ల ఎస్టీపీల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని జలమండలిని ప్రభుత్వం ఆదేశించింది. కాగా జలమండలి సమగ్ర నివేదికను సిద్ధం చేసింది. 2050 సంవత్సరం నాటికి పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకుని జంట జలాశయాలను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రత్యేక మాస్టర్ప్లాన్ రూపకల్పన జరుగుతుందని అధికారులు తెలిపారు.
కలుషిత కాటు నుంచి విముక్తి..
నగరానికి ప్రధాన తాగునీటి వనరులు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లే కాగా.. ఉస్మాన్సాగర్కు 738 చదరపు కిలోమీటర్లు (117 గ్రామాలు), హిమాయత్సాగర్కు 1308 చదరపు కిలోమీటర్ల (208 గ్రామాలు) పరీవాహాక ప్రాంతం ఉంది. హిమాయత్సాగర్లో పరిధిలోని వెంకటాపూర్ మెయిన్ రివర్ కోర్సు (ఈసీ), దొడ్డి సుల్తాన్పల్లి, అమ్డాపూర్, ఉస్మాన్సాగర్ పరిధిలోని చందిప్ప మొయిన్ రివర్ కోర్సు, ఖానాపూర్, పొద్దుటూర్, బాల్కాపూర్, ఎల్వర్తి, మేడిపల్లి నుంచి జలాశయాల్లోకి నీరు వచ్చి చేరుతుంది. అయితే జంట జలాశయాల సమీప గ్రామాల నుంచి మురుగునీరు వచ్చి చేరడం కారణంగా ఈ నీళ్లు కలుషితం అవుతున్నాయి. చిలుకూరు, ఖానాపూర్ తదితర గ్రామాల నుంచి మురుగునీటికి తోడు వ్యర్థ, క్రిమి సంహారక పదార్థాలు, నూనె మలినాలు చేరుతుండటంతో.. వీటికి అడ్డుకట్ట వేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ దిశగా చర్యలకు ఉపక్రమించి ఎస్టీపీలను ఏర్పాటు చేసి మురుగునీటి నుంచి రిజర్వాయర్లను కాపాడనున్నారు. కాగా గతంలో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ల నుంచి 27.59 శాతం నీటి వాటాను వినియోగించగా.. ప్రస్తుతం కేవలం 1.25 శాతం మాత్రమే ఈ జలాశయాల నుంచి నీటి సరఫరా జరుగుతుంది.