STPs | సిటీబ్యూరో, మార్చి 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి లక్ష్యంగా గత కేసీఆర్ ప్రభుత్వం రూ. 3866.41కోట్ల వ్యయంతో 1259.50 ఎంఎల్డీల సామర్థ్యంతో చేపట్టిన 31 ఎస్టీపీలు విడతల వారీగా అందుబాటులోకి వస్తున్నాయి. ఐదు సర్కిళ్లలో ఆధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో ఈ కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతుండగా.. 31 ఎస్టీపీల్లో గత అసెంబ్లీ ఎన్నికల ముందే కోకాపేట, దుర్గం చెరువు ఎస్టీపీలను అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. తుది దశలో ఉన్న ఈ ప్రాజెక్టు పనుల్లో భాగంగా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం పనులను పూర్తి చేసుకున్న ఎస్టీపీలను ప్రారంభిస్తున్నది. ఇందులో భాగంగానే శనివారం సీఎం రేవంత్రెడ్డి నల్లచెరువు, పెద్ద చెరువుల వద్ద ఎస్టీపీలను ప్రారంభించారు. అలాగే నేడు మీరాలం చెరువు వద్ద రూ. 41.50 ఎంఎల్డీల సామర్థ్యంతో రూ.125.19కోట్లతో చేపట్టిన నాలుగు ఎస్టీపీలను ఆదివారం సీఎం ప్రారంభించనున్నారు. ఈ మేరకు జలమండలి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
మీరాలం ఎస్టీపీ వివరాలు..
హైదరాబాద్ నగరంలో సీవరేజీ మాస్టర్ ప్లాన్, ఎస్టీపీల ప్రాజెక్టు ప్యాకేజీ-2లో భాగంగా మీరాలం చెరువు వద్ద నాలుగు ఎస్టీపీలను నిర్మించారు.
నిర్మాణ వ్యయం -రూ. 125.19 కోట్లు
సామర్థ్యం – 41.5 ఎంఎల్డీలు( ఒక్కొక్కటి 10.375 ఎంఎల్డీల సామర్థ్యంలో 4 ఎస్టీపీలు)
వినియోగించిన సాంకేతికత – సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్)
ప్రయోజనం పొందే ప్రాంతాలు : రిజ్వాన్ కాలనీ, మైలార్ దేవ్పల్లి, బాబుల్రెడ్డి నగర్, పెద్దకుంట, మొఘల్ కాలనీ, సులేమాన్ నగర్, ఎన్టీఆర్ నగర్, ఇందిరానగర్, శివరామ కాలనీ, మిర్ మహ్మద్ పహాడి, ఆదర్శనగర్, హసన్ నగర్, అన్సారీ రోడ్, శివరాంపల్లి నాలా ఏరియా తదితర ప్రాంతాలకు మురుగునీటి సమస్య తీరనుంది.