శేరిలింగంపల్లి/కుత్బుల్లాపూర్/చర్లపల్లి, జనవరి 10: గ్రేటర్లో వీధికుక్కలు మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయి. శేరిలింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న డొయాన్స్కాలనీలో వీధికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇటీవలె అద్దెకు వచ్చిన విజయ్నాయక్ కుమారుడు లిఖిల్కుమార్(7) బుధవారం ఇంటి ముందు సైకిల్ తొక్కుతుండగా ఒకేసారి నాలుగు వీధికుక్కలు దాడి చేశాయి.
ఆ బాలుడికి తల, కాలు, చేతులపై కాట్లు పడ్డాయి. కుటుంబసభ్యులు కుక్కలను తరిమేసి బాలుడిని కొండాపూర్ జిల్లా దవాఖానకు తరలించారు. అలాగే జీడిమెట్ల డివిజన్లోని సుచిత్ర గ్రీన్పార్కులోని ఓ విల్లాలో సెక్యూరిటీ గార్డు కుమారుడు ప్రకాశ్(8) ప్రభుత్వ పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా వీధికుక్కలు దాడికి దిగాయి. స్థానికులు గమనించి కుక్కలను చెదరగొట్టి బాలుడిని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చేర్పించారు.అదేవిధంగా చర్లపల్లి డివిజన్ పరిధిలోని శివసాయినగర్ నివాసి జంగయ్య తన ఇంటి ముందు ఉండగా గుంపుగా వచ్చిన వీధి కుక్కలు ఆయనపై దాడి చేశాయి. జంగయ్య తీవ్రంగా గాయపడటంతో వెంటనే స్థానికులు గమనించి వైద్యశాలకు తరలించారు.