వెంగళరావునగర్,సెప్టెంబర్ 12: ప్రజా శ్రేయస్సే టీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. మంగళవారం వెంగళరావునగర్ డివిజన్ జవహర్నగర్ లో రూ.15 లక్షల నిధులతో తాగునీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. అభివృద్ధి సంక్షేమ పథకాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఇంటింటికీ అందుతున్నాయని అన్నారు. ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులను కల్పించేందుకు ఎన్ని నిధులైనా వెచ్చిస్తామన్నారు. రోడ్లు, తాగునీటి వసతి కల్పన కోసం నిధులను మంజూరు చేస్తున్నామన్నారు. పేద ప్రజల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్రూంలను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిందని.. పేదల కళ్లల్లో సంతోషం కనిపిస్తుందని పేర్కొన్నారు. సొంతిల్లు కట్టుకోలేని అసలు సిసలైన పేదలను గుర్తించి ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూంలను మంజూరు చేసిందన్నారు. తమ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లులాంటివని అన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని ప్రజలకు అందజేశామన్నారు. పేదింటి ఆడపిల్లల పెండ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, వితంతు, వృద్ధాప్య, ఒంటరి మహిళ, దివ్యాంగ పింఛన్లు అందజేస్తున్నామని అన్నారు. మైనారిటీలకు రుణాలు, దళితులకు దళిత బంధు పథకాలను ఇచ్చామని తెలిపారు. ప్రజలకు ఏ విధమైన సమస్యలున్నా తన దృష్టికి తీసుకు వస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేదీప్య రావు, జీటీఎస్ దేవాలయం చైర్మన్ చిన్న రమేశ్,మాజీ కార్పొరేటర్ శ్యామ్రావు,నాయకులు అంబటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి వేణు,మైనార్టీ సెల్ అధ్యక్షులు డాక్టర్ ఆఫ్తాబ్, సత్యనారాయణ,పవన్, ఆంజనేయులు యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
బంజారాహిల్స్,సెప్టెంబర్ 12: ఆడబిడ్డల ముఖాల్లో సంతోషాన్ని నింపడం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలుచేస్తున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే అని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. యూసుఫ్గూడ డివిజన్కు చెందిన ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మంగళవారం అందజేశారు. చెక్కులతో పాటు ఎమ్మెల్యే మాగంటి లబ్ధిదారులకు ప్రత్యేకంగా కానుకలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదింట్లో ఆడపిల్ల పెండ్లి అంటే గతంలో తల్లిదండ్రులు ఇబ్బందులు పడేవారన్నారు. వారి కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకాలు వచ్చిన తర్వాత పేదల జీవితాల్లో మార్పులు వచ్చాయని, ఆడపిల్ల అంటే భారం కాదనే ఆలోచన తల్లిదండ్రుల్లో ఏర్పడిందన్నారు. ఆసరా పథకం కింద పింఛన్లను అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, డివిజన్ అధ్యక్షుడు సంతోష్, ప్రధాన కార్యదర్శి నర్సింగ్దాస్, బసవరాజు తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న యూసుఫ్గూడ డివిజన్కు చెందిన రాంబాబుకు సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.2.50లక్షల ఎల్వోసీ పత్రాన్ని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్ పాల్గొన్నారు.