సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే జోన్ ఆధ్వర్యంలో 50 అమృత్ భారత్ స్టేషన్లను అభివృద్ధి చేయడానికి పనులు ప్రారంభించనున్నారు. అందుకు సంబంధించి ఈనెల 6న ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నట్లు శుక్రవారం రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ ప్రకటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జోన్ ఆధ్వర్యంలో అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి, అందుకోసం కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. ఈ మేరకు తెలంగాణలో 21, ఏపీలో 15, మహారాష్ట్రలో 13తో పాటు కర్ణాటకలో 1 చొప్పున అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించి ఏయే స్టేషన్లకు ఎంత బడ్జెట్ కేటాయించారు.. అన్న వివరాలు కూడా విడుదలజేశారు. అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద కొనసాగుతున్న స్టేషన్ల అభివృద్ధికి మొత్తం రూ.2,079.29 కోట్లు రైల్వే బోర్డు కేటాయించిందన్నారు.
సకల సౌకర్యాలతో అమృత్ భారత్ స్టేషన్ల అభివృద్ధి..
ఆధునిక అవసరాలు, ప్రస్తుత ప్రజల అవసరాలకు అనుగుణంగా హైటెక్ హంగులతో, సకల సౌకర్యాలతో రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయబోతున్నారు. అందుకు సంబంధించిన కొన్ని స్టేషన్ల నమూనా ఫొటోలను విడుదలజేశారు. వాటి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ విడుదల చేశారు. సిటీ సెంటర్లలో ఉన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నారు. నగరానికి రెండు వైపులా ఉండే విధంగా స్టేషన్ను ఆధునీకరిస్తున్నారు. స్టేషన్ భవనాన్ని పునరాభివృద్ధి చేస్తారు. ఆధునిక ప్రయాణికులకు అనుగుణంగా అన్ని రకాల వసతులు, సదుపాయాలు కల్పిస్తారు. స్టేషన్లలో పచ్చదనాన్ని అభివృద్ధి చేస్తారు. ఇందుకోసం విరివిగా మొక్కలు నాటుతారు. ఈ మేరకు అన్ని అమృత్ భారత్ స్టేషన్లలో ల్యాండ్స్కేప్ను అభివృద్ధి చేయనున్నట్లు రైల్వే జీఎం పేర్కొన్నారు.